శ్రీరాముడి వారసులమని చెప్పుకుంటున్న ‘ఆ ఏడుగురు’!

by Dishanational4 |
శ్రీరాముడి వారసులమని చెప్పుకుంటున్న ‘ఆ ఏడుగురు’!
X

దిశ, నేషనల్ బ్యూరో : సుప్రీంకోర్టులో రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసు విచారణ సందర్భంగా ఏడుగురు వ్యక్తులు తాము శ్రీరాముడి వారసులమని వాదన వినిపించారు. 11 రోజుల పాటు జరిగిన ఈ విచారణలో విభిన్న నేపథ్యాలకు చెందిన వ్యక్తులు అఫిడవిట్‌లను సమర్పించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఎట్టకేలకు అయోధ్య వివాదం సమసిపోయింది. అయినప్పటికీ భగవాన్ శ్రీరాముడికి తాము వారసులమని చెప్పుకునేవారు ఇంకా వారి వాదనను వినిపించడం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

లోకేంద్ర సింగ్ కల్వి

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన లోకేంద్ర సింగ్ కల్వి తాను రాముడి వారసుడినని అంటున్నారు. తన వంశ వృక్షం రాముడిని కనెక్ట్ అవుతుందని చెబుతున్నారు. అయోధ్య రాముడి భూమిపై తనకున్న హక్కును తెలుపుతూ ఆయన గతంలో కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఉదయపూర్ రాజ కుటుంబంతో సంబంధాలు కలిగి ఉండే సిసోడియా వంశానికి చెందిన వ్యక్తే లోకేంద్ర సింగ్ కల్వి.

ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ (రాజస్థాన్ క్యాబినెట్ మంత్రి)

రాముడి కుమారుడైన కుశుడికి వంశం ఉందని ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ పేర్కొన్నారు. కుశుడి వంశంతో అనుబంధమున్న ఖచరియావాస్‌ కుటుంబంలో తాను జన్మించానని ఆయన వాదిస్తున్నారు. సూర్యవంశీ రాజ్‌పుత్‌లు కూడా రాముడి వంశం వారేనని చెప్పారు. ప్రస్తుతం వివిధ పేర్లు కలిగిన వంశాల్లో రాముడి వంశీకులు ఉన్నారని తెలిపారు.

సతేంద్ర రాఘవ (రాజస్థాన్‌ కాంగ్రెస్ అధికార ప్రతినిధి)

రాఘవ్ రాజ్‌పుత్‌లు రాముడి ప్రత్యక్ష వారసులని సతేంద్ర రాఘవ అంటున్నారు. తాను అల్వార్ 'తికానా' రాజవంశం నుంచి వస్తానని తెలిపారు. తనది బద్గుర్జర్ గోత్రమని.. ఈ గోత్రం యొక్క సంబంధం నేరుగా లవుడి మూడో తరంతో కలుస్తుందని చెప్పారు. ప్రస్తుతమున్న మేవార్‌ ప్రాంతంలో లవుడే సిసోడియా రాజవంశాన్ని స్థాపించారని పేర్కొన్నారు.

అరవింద్ సింగ్ మేవార్ (హెచ్ఆర్‌హెచ్ హోటల్స్ గ్రూప్ యజమాని)

తమ వంశం మూలాలు ఇక్ష్వాకు, మను, బ్రహ్మలతో కలుస్తాయని అరవింద్ సింగ్ మేవార్ తెలిపారు. తాము రామజన్మ భూమిపై ఎలాంటి హక్కును కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. అయోధ్యలో ఆలయ నిర్మాణాన్ని మాత్రమే తాము కోరుకున్నామని తేల్చి చెప్పారు.

దియా కుమారి (రాజస్థాన్ డిప్యూటీ సీఎం)

దియా కుమారి ప్రస్తుతం రాజస్థాన్‌‌లోని బీజేపీ సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. గతంలో ఈమె బీజేపీ నుంచి ఎంపీగా(రాజ్‌సమంద్‌) కూడా వ్యవహరించారు. ఈమె తనను తాను రాముడి 309వ వారసురాలిగా చెప్పుకుంటుంది. తాను రాముడి కుమారుడైన కుశుడి వంశీకురాలినే అని చెప్పేందుకు డాక్యుమెంటెడ్ ఆధారాలు కూడా ఉన్నాయని దియా వాదిస్తున్నారు. అలహాబాద్ హైకోర్టులో సమర్పించిన ఒక డాక్యుమెంట్ ప్రకారం ఆమె కుశవాహ లేదా కచావా వంశానికి చెందినది.

హనుమాన్ ప్రసాద్ అగర్వాల్ (అడ్వకేట్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు)

తాను రాముడి వారసుడినని హనుమాన్ ప్రసాద్ అగర్వాల్ అంటున్నారు. మహారాజా అగ్రసేన్ కుష్.. కుశుడి 34వ తరానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. మహారాజ్ అగ్రసేన్ కుమారులు లేదా మనవళ్లు అయిన అగర్వాల్‌లందరూ రాముడి వారసులేనని ఆయన పేర్కొన్నారు.

విశ్వరాజ్ సింగ్ (మేవార్)

అరవింద్ సింగ్ మేవార్ మేనల్లుడు విశ్వరాజ్ సింగ్ తన కుటుంబానికి అయోధ్యపై హక్కులు ఉన్నాయని గతంలో వాదన వినిపించారు. తాము కూడా రాముడి వంశీకులమే అని ఆయన చాలాసార్లు చెప్పారు.



Next Story

Most Viewed