రైతాంగ ఉద్యమంపై దుష్ప్రచారం మానుకోవాలి: రాఘవులు

by  |
రైతాంగ ఉద్యమంపై దుష్ప్రచారం మానుకోవాలి: రాఘవులు
X

దిశ, ముషీరాబాద్: రైతు ఉద్యమాన్ని అణచివేయాలని, విచ్ఛిన్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీ.వీ.రాఘవులు అన్నారు. రైతాంగ ఉద్యమాన్నిఉగ్రవాదులు , మావోయిస్టులు చేస్తున్న ఉద్యమంగా చిత్రీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రైతు ఉద్యమాన్ని అప్రతిష్టపాలు చేయడాన్ని ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు.

హిమాయత్ నగర్‌లోని రిలయన్స్ మాల్ ఎదుట ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీ.వీ.రాఘవులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసులకు రైతు సంఘాల కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు ప్రజా, రైతు సంఘాల నాయకులను అరెస్టు చేసి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా బీ.వీ రాఘవులు మాట్లాడుతూ… రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని,విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని 18 రోజులుగా దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ సర్కార్‌కు వ్యతిరేకంగా రైతాంగం పోరాటం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో పలు దఫాలుగా రైతాంగాన్ని చర్చలకు పిలిచి కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. చట్టాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed