పెరుగుతున్న ఆంక్షలతో వాహన తయారీ కంపెనీల ఆందోళన

by  |
పెరుగుతున్న ఆంక్షలతో వాహన తయారీ కంపెనీల ఆందోళన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు మారుతీ సుజుకి ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల వల్ల అమ్మకాలు తగ్గుతాయని భావిస్తున్నాయి. ఆటో అమ్మకాలు ఆర్థిక వృద్ధికి కీలకమని, వినియోగదారుల సెంటిమెంట్‌తో సంబంధం కలిగిన పరిశ్రమ అని మారుతీ సుజుకి తెలిపింది. కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటం ఖచ్చితంగా కస్టమర్ల సెంటిమెంట్‌ను ప్రతికూలంగా మారుస్తుంది. ఇది అమ్మకాలు క్షీణించేందుకు దోహదపడుతుందని మారుతీ సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

లాక్‌డౌన్ వల్ల కార్లను డెలివరీ చేయడం వీలవదు. అలాగే, కరోనా విజృంభిస్తున్న వేళ వినియోగదారుల కొనుగోళ్లపై ప్రభావం చూపిస్తుందని, ఇది ఆటో పరిశ్రమకు సంక్లిష్ట పరిస్థితి అని శశాంక్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై స్పందించిన టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ నవీన్ సోనీ మాట్లాడుతూ.. కరోనా పెరుగుదలతో స్థానికంగా విధిస్తున్న ఆంక్షలు ఆర్డర్లు, డెలివరీలపై ప్రభావం చూపిస్తాయన్నారు. ఉత్పత్తి కార్యకలాపాలు, వాహనాల ఉత్పత్తిపై కంపెనీలు జాగ్రత్తగా ఉన్నాయని నవీన్ సోనీ తెలిపారు. ఈ పరిస్థితుల్లో తక్షణం డిమాండ్‌పై దృష్టి సారించడం, ఉత్పత్తిని క్రమబద్దీకరించడం, వేగంగా డెలివరీలను చేస్తూ సమయాన్ని తగ్గించడం వల్ల కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలను అందించాలని కంపెనీలు భావిస్తున్నాయి.


Next Story

Most Viewed