బతుకు బండి బోల్తా.. ఆకలి కేకలు

by  |
బతుకు బండి బోల్తా.. ఆకలి కేకలు
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: కష్టజీవుల బతుకులను కరోనా కకావిలకం చేస్తోంది. స్వీయ నిర్బంధం తప్ప మరో మందు లేని ఈ వైరస్‌ వల్ల అనేక వర్గాలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. వారిలో ఆటో డ్రైవర్లు ఉన్నారు. రెక్కాడితేనేగాని డొక్కాడని బతుకులకు కరోనా రూపంలో కష్టాలు వచ్చిపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా పది రోజుల నుంచి బతుకు చక్రం మొరాయిస్తోంది. దీంతో ఇండ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కుటుంబ కనీస అవసరాలు, మరోవైపు నెలవారీ ఫైనాన్స్ లు ఎలా చెల్లించాలో తెలియక ఆయోమయానికి గురవుతున్నారు. ఆటోలోనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న చిన్న బతుకులు చితికి పోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 1.5 లక్షల ఆటోలున్నాయి.

ఆటోలను నమ్ముకొని ప్రత్యక్షంగా,పరోక్షంగా రెండు లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఒక ఆటో డ్రైవర్ సగటున రోజుకు 100 నుంచి 150 కిలో మీటర్ ల వరకు ఆటో నడిపితే రూ.800 నుంచి రూ.1200 వరకు లభిస్తాయి. సొంత ఆటో ఉన్నవారైతే ఫైనాన్స్ కోసం కొంత మొత్తం కేటాయించాలి. అద్దెకు ఆటో నడిపితే యజమానికి రూ.300 నుంచి రూ.400 వరకు చెల్లించాలి. దీనికి తోడు ఇంధనం, గ్యాస్ ఖర్చులు ఆదనంగా ఉంటాయి. ఈ ఖర్చులన్నీ పోను చివరకు రూ.500 నుంచి రూ.700 వరకు మిగిలేవి.

ఇలా ఏ రోజుకు వచ్చే ఆదాయంతో ఆరోజే బతుకు బండి నడిచేది. కానీ లాక్ డౌన్ కారణంగా గత 10 రోజులుగా ఆటో వాలాల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. బతుకు భారం..నగరంలో ఆటోవాలాల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కుటుంబ అవసరాలు, ఇంటి అద్దెలు, ఆటో ఫైనాన్స్ లు తీర్చలేక నానా అవస్థలు పడుతున్నారు.

పెరిగిన నిత్యావసర వస్తువులను కొనలేక తినలేక పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. బియ్యం, పప్పులు, వంటనూనె,కూరగాయలు, గ్యాస్ తదితర ఖర్చుల కోసం నెలకు రూ.5వేల పైనే అవుతోందని సుభాష్ నగర్ కు చెందిన ఆటో డ్రైవర్ యాదగిరి వాపోతున్నాడు. ఇకపోతే బస్తిలలో రెండు గదులు ఉన్న ఇంటి అద్దె కనీసం రూ.5000 నుంచి రూ.8000 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇక ఇతరాత్ర ఖర్చులు తలకు మించిన భారంగా మారాయి. లాక్ డౌన్ కారణంగా ఉదయం 6 గంటలకు రోడ్డుపైకి వస్తే..ఒకటి అరా గిరాకి వస్తున్నాయి. లేదంటే తిరిగి 10 గంటలలోపు ఉట్టి చేతులతోనే ఇంటికి వెళ్లాల్సి వస్తుందని బోయిన్ పల్లికి చెందిన కిరణ్ వాపోతున్నాడు.

లాక్ డౌన్ కాలంలో ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు ధీనంగా అడుగుతున్నారు. కరోనా భారిన చాలా మంది డ్రైవర్లు, వారి కుటుంబాలు కరోనా భారిన పడ్డాయని, వైద్యం కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేసినట్లు అల్వాల్ కు చెందిన వెంకటేశ్ చెబుతున్నాడు. ఒకవైపు బతుకు బండిని లాగడం.. మరోవైపు కరోనా మహామ్మారి నుంచి బయట పడేందుకు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు వాపోతున్నాడు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలు అపన్నహస్తం కోసం ఎదిరి చూస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంటి అద్దెలు, ఆటో ఫైనాన్స్ ల భారం పడకుండా ప్రభుత్వమే తగు చర్యలు తీసుకోవాలని అంటున్నాయి.

Next Story

Most Viewed