అంధ విద్యార్థులకు ఆడియో బుక్స్

by  |
audio books for visually impaired
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచాన్ని కంటితో కాకుండా స్పర్శ, మనస్సుతో అనుభవించే యోగులు ‘అంధులు’. కళ్లు కనిపించని వారికి అక్షరాన్ని పరిచయం చేసి, భావి భవితకు, రేపటి చరిత్రకు పునాదులు వేశాడు లూయిస్ బ్రెయిలీ. చీకట్లు నిండిన కళ్లలో ‘బ్రెయిలీ లిపి’తో జ్ఞానజ్యోతులు వెలిగించి విద్యకు నిజమైన నిర్వచనం అందించాడు ఆ మహానీయుడు. అక్షరాలను ప్రేమతో స్పృశిస్తూ, లోలోపల పదబంధాలను అల్లుకుంటూ, విశ్వాంతరాల్లోకి ప్రయాణిస్తూ, మూడో నేత్రంతో తమవైన విజయాలు అందుకుంటున్నారు అంధులు. ఇంతలోనే కరోనా మహమ్మారి కారణంగా వారి చదువులకు బ్రేకులు పడ్డాయి. లాక్‌డౌన్ వల్ల ‘ఆన్‌లైన్ క్లాసు’లు మాత్రమే జరగడంతో వేలాదిమంది విజువల్లీ ఇంపెయిర్డ్ స్టూడెంట్స్ పాఠాలకు దూరమవగా.. వారికి ఆన్‌లైన్‌లో బోధించే ప్రత్యేక పద్ధతులు ఇంకా అభివృద్ధి కాలేదు. ఈ నేపథ్యంలోనే కొందరు వ్యక్తులు అంధుల కోసం ప్రత్యేకంగా ఆడియో బుక్స్ అందిస్తూ భవిష్యత్తుపై ఆశలు చిగురింపచేస్తున్నారు.

దృష్టి లోపం ఉన్నవారికి పాఠాలను బోధించడం చాలా భిన్నంగా ఉంటుంది. వాళ్లు బాల్యం నుంచే అంధ పాఠశాలలకు వెళ్లడంతో పాటు, బ్రెయిలీ లిపి పుస్తకాలను అభ్యసిస్తారు. అక్కడ తమ తోటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాఠాలు నేర్చుకోవడంలో తగినంత సాయాన్ని అందిస్తారు. కానీ పాండమిక్ ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చేయగా, సాధారణ పరిస్థితులతో పోల్చితే రెట్టింపు సమస్యను అంధులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిల వరకు చాలామంది విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరుకాలేకపోతున్నారు. ఒకవేళ హాజరైన పాఠాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో లక్నోకు చెందిన ప్రొఫెసర్ రాకేష్ జైన్ తమ ‘రీహాబిటేషన్ సోసైటీ ఆఫ్ ది విజువల్లీ ఇంపెయిర్డ్(ఆర్‌ఎస్‌వీఐ)’ ద్వారా ఆడియో బుక్స్ రూపొందించాడు. ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో లభ్యమయ్యే వీటిని విద్యార్థులు ఉచితంగా అందుకోవచ్చు. సీబీఎస్‌ఈ, ఐఎస్‌సీ, ఎన్‌సీఈ‌ఆర్‌టీ, యూపీబోర్డ్‌లతో పాటు ఇతర యూనివర్సిటీలకు చెందిన దాదాపు 1500 పుస్తకాలను ఆర్‌ఎస్‌వీఐ ఆడియోబుక్స్‌గా మార్చింది. ఆర్ట్స్, సైన్స్, కామర్స్‌తో పాటు ఇతర సబ్జెక్ట్‌ల‌తో కూడిన క్లాస్ 1-పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిలబస్‌ను ఈ బుక్స్ ద్వారా కవర్ చేశారు. యూఏఈ, యూఎస్, ఆస్ట్రియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లోని అంధ విద్యార్థులు కూడా జైన్ అందిస్తున్న ఆడియో టెక్ట్స్‌బుక్స్‌ను వినియోగించుకుంటున్నారు.

లక్నో నుంచి లండన్ వరకు, దృష్టి లోపం ఉన్న విద్యార్థులు ఇప్పుడు ఆడియో పాఠ్యపుస్తకాలు, వెబ్ సిరీస్ సమీక్షలను వినడం ద్వారా తరగతి గది వాతావరణాన్ని పునరుద్ధరించగలుగుతున్నారు. మేం రూపొందించిన ఆడియో పుస్తకాలకు మంచి స్పందన వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీహాబిటేషన్ సంస్థల నుంచి నెలకు 2 వేలకు పైగా అభ్యర్థనలు వస్తున్నాయి. మొత్తంగా 20మంది వాలంటీర్లతో బుక్స్ రికార్డ్ చేస్తున్నాం. పాండమిక్ సమయంలో విద్యార్థులకు సీడిల రూపంలో పోస్ట్ చేయగా, కోవిడ్ వ్యాప్తి తర్వాత ప్రత్యేక ఫైల్ ట్రాన్స్‌ఫర్ అప్లికేషన్ ద్వారా ఆడియోబుక్స్ పంపిస్తున్నాం. తాజా న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలను విద్యార్థులకు ఎప్పటికప్పుడు చేరవేయాలనే ఉద్దేశంతో ‘ఆర్ఎస్‌వీఐ న్యూస్ క్యాప్సుల్’ ‌ను ప్రారంభించాం. ఇక కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ‘ఉడాన్’ ఆడియోబుక్స్ తీసుకొచ్చాం. – ప్రొఫెసర్ రాకేష్ జైన్, ఇంగ్లీష్ విభాగ అధిపతి, లక్నో విశ్వవిద్యాలయం

వెలుగులు పంచే ‘ప్రకాశ్’

ఉన్నత విద్య అభ్యసించే అంధ విద్యార్థులకు ఆయా విద్యా సంస్థలు పీడీఎఫ్‌/ఈ-పుస్తకాల లేదా జర్నల్స్, పేపర్స్, టెక్ట్స్‌బుక్స్ రూపంలో పాఠ్యాంశాలను అందిస్తాయి. అందులో పీడీఎఫ్ ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూటెడ్ రీడింగ్ మెటీరియల్‌ను బ్రెయిలీలో ముద్రించవచ్చు లేదా అవి అందుబాటులో ఉంటే ఆడియోబుక్స్ వినవచ్చు. అయితే ఆయా కాలేజీలు, యూనివర్సిటీలు అందించే మెటీరీయల్‌ను బ్రెయిలీలో పొందాలన్నా, ఈ బుక్స్ కొనాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలోనే ‘ పారాక్లెట్ ఇమేజ్ ల్యాబ్స్’ అనే స్టార్టప్ కంపెనీ.. దృష్టి లోపం ఉన్నవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించుకుని ‘ప్రకాశ్’ అనే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఏ పేపర్‌నైనా స్కాన్ చేసి, అందులోని అంశాన్ని గట్టిగా చదువుతుంది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్‌ను కూడా ఇందులో అప్‌లోడ్ చేస్తే అది బిగ్గరగా చదవి వినిపిస్తుంది. ఇది ప్రాంతీయ భారతీయ భాషల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ కాగా, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఇది ఆఫ్‌లైన్‌లో వర్క్ చేయడం విశేషం. అంతేకాదు మైక్రోసాఫ్ట్ లేదా అడోబ్ సాఫ్ట్‌వేర్ సూట్‌ల మాదిరిగానే వినియోగదారులు ఒక్కసారి కొనుగోలు చేస్తే సరిపోతుంది. కోయంబత్తూరులోని బన్నారి అమ్మన్ ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన శాంతియ, ఆమె బృందంతో కలిసి దీన్ని అభివృద్ధి చేసింది.

ప్రకాశ్‌లో ఇన్‌బిల్ట్‌గా ఎగ్జామ్ రైటర్ సాఫ్ట్‌వేర్ కూడా ఉంది. అంధులకు పరీక్ష సమయంలో సాయపడే లేఖకులను భర్తీ చేయడంలో ఇది సహాయపడుతుంది. అంతేకాదు ఈ సాఫ్ట్‌వేర్ ప్రశ్నలను చదివితే, దానికి అంధ విద్యార్థులు ఓరల్‌గా ఇచ్చే సమాధానాన్ని ఇది పిడిఎఫ్‌గా కన్వర్ట్ చేసి, సదరు ఎగ్జామినర్‌కు సెండ్ చేస్తుంది.

కన్నడిగుల కోసం..

క్లాస్ 1 నుంచి10 మధ్య అంధత్వం, దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కన్నడలో ఉచిత ఆడియో పాఠ్యపుస్తకాలను అందించాలనే ఉద్దేశ్యంతో ‘కన్నడ పుస్తక ప్రాజెక్ట్’ 2017లో మొదలైనా పాండమిక్ నేపథ్యంలో 2020లో పూర్తయింది. ఇంగ్లాండ్‌, శాంటాలాలోని లీడ్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రాకేశ్ తివారీ, అంధ విద్యార్థులకు సైన్స్, గణితాన్ని బోధించే ఉపాధ్యాయుడు, మల్టీమీడియా నిపుణుడు రమేష్ బాబు సంయుక్తంగా దీన్ని ప్రారంభించారు. తొలిగా వాలంటీర్ల సాయంతో ఆడియోబుక్స్ రికార్డ్ చేశారు. అయితే వాలంటీర్ల ఉచ్ఛారణ లోపాలు, తప్పులు ఇతర కారణాల వల్ల ఇది విఫలమైంది. దాంతో ఇండియన్ ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థుల సాయం తీసుకుని టెక్స్ట్ టు స్పీచ్ (టీటీఎస్) ఇంజిన్‌ను అభివృద్ధి చేశారు. ఈ ఇంజిన్‌తో ఓ అధ్యాయాన్ని గంట వ్యవధిలోనే ఆడియో ఫైల్‌ను సృష్టించవచ్చు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట 9,10 తరగతుల.. సోషియాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్స్‌కు సంబంధించిన ఆడియో పుస్తకాలతో విజయవంతంగా ఒక లైబ్రరీని సృష్టించింది. చరిత్ర, సామాజిక శాస్త్రానికి చెందిన అధ్యాయాలు కూడా పూర్తయ్యాయి. విద్యార్థులు కన్నడ పుస్తక వెబ్‌సైట్‌లో లేదా గూగుల్ పాడ్‌కాస్ట్‌ల ద్వారా ఉచితంగా ఈ ఆడియో పాఠ్యపుస్తకాలను వినవచ్చు.



Next Story

Most Viewed