త్వరలో మళ్లీ భారత మార్కెట్లోకి ఆడి ఎస్‌యూవీ

by  |
audi car
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా మరో నెల రోజుల్లో తన సరికొత్త క్యూ5 ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. దేశీయంగా తన అమ్మకాల వృద్ధిని వేగవంతం చేసేందుకు ఇది సాయపడుతుందని కంపెనీ అభిప్రాయపడింది. రాబోయే రెండు వారాల్లో కొత్త ఎస్‌యూవీ కోసం బుకింగ్‌లను ప్రారంభిస్తుంది. గతేడాది భారత్‌లో బీఎస్6 ఉద్గార నిబంధనలు వచ్చిన తర్వాత దేశంలో డీజిల్ ఇంజిన్ వాహనాలను నిలిపేయాలని కంపెనీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో ప్రధానంగా క్యూ3, క్యూ5, క్యూ7 ఎస్‌యూవీ కార్ల అమ్మకాలను కూడా నిలిపివేసింది.

తాజాగా, నవంబర్‌లో క్యూ5 వేరియంట్ ఎస్‌యూవీని స్థానికంగానే ఉత్పత్తి చేయనున్నాం…క్యూ మోడల్ విభాగంలో సామర్థ్యాన్ని పెంచేందుకు ఎదురుచూస్తున్నామని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ చెప్పారు. క్యూ5 మోడల్ కంపెనీలో అత్యంత విజయవంతమైన మోడళ్లలో ఒకటి కావడంతో రానున్న రోజుల్లో మరింత అమ్మకాల వృద్ధిని చూడగలమనే నమ్మకం ఉందని ఆయన తెలిపారు. 2020లో మొత్తం 1,639 వాహనాలను విక్రయించిన ఆడి కంపెనీ, ప్రస్తుత ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే 115 శాతం అమ్మకాల పెరుగుదలను నమోదు చేసింది. కొత్త ఎస్‌యూవీని తీసుకురావడం ద్వారా ఇది మరింత పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఆటో పరిశ్రమలో సెమీకండక్టర్ల కొరత సమస్య గురించి స్పందించిన బల్బీర్ సింగ్ ఇప్పటివరకు అవసరమైన స్థాయిలో ఉత్పత్తిని చేపడుతున్నాం.. అయితే, ఈ సమస్య కారణంగా కొన్ని కార్ల వెయిటింగ్ సమయం పెరిగిందనేది వాస్తవమన్నారు.

Next Story

Most Viewed