కొత్త కోడలి పైశాచికత్వం.. వారు నచ్చలేదని టీ లో అది కలిపి

by  |
కొత్త కోడలి పైశాచికత్వం.. వారు నచ్చలేదని టీ లో అది కలిపి
X

దిశ, వెబ్‌డెస్క్: కొడుకు పెళ్లి ఎంతో ఘనంగా చేశారు ఆ తల్లిదండ్రులు.. కొత్త కోడలు ఇంటికి వచ్చాక ఆ ఇల్లంతా కళకళలాడుతుంది అనుకున్న అత్తమామలకు కోడలు తీరు అస్సలు నచ్చలేదు. ఎప్పుడు ముభావంగా ఉండేది.. ఎవరితోనూ మాట్లాడేది కాదు. అయితే అత్తారిల్లు కొత్త కదా.. త్వరలోనే అన్ని సర్దుకుంటాయి అనుకున్నారు.. కానీ, కోడలు ఇంతపని చేస్తుందని వారు కలలో కూడా ఉహించి ఉండరు. అయితే భర్త, అత్తింటివారు నచ్చని ఆమె ఏకంగా వారిని హతమార్చడానికే ప్లాన్ వేసింది. ఆమె ప్లాన్ కి ఒక చిన్నారి బలవ్వగా.. మిగతావారు చావుతో పోరాడుతున్నారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. బహ్రైచ్ తాలూకాలోని మచియాహి గ్రామానికి చెందిన జైశ్వాల్ కుమారుడు పూరన్‌కు అనిత అనే యువతితో గతేడాది డిసెంబర్‌లో వివాహం జరిగింది. ఆమె అత్తవారింట అడుగుపెట్టింది కానీ, ఆమె భర్త, అత్తింటివారు ఆమెకు అస్సలు నచ్చలేదు. దీంతో ఎప్పుడు ముభావంగానే ఉండేది. ఇక ఇటీవల ఆషాఢమాసం కావడంతో పుట్టింటికి వెళ్లివచ్చిన అనితకు ఎలాగైనా వీరందరిని వదిలించుకోవాలనుకుంది. భర్తతో సహా అత్తింటివారందరిని చంపాలనుకుంది. మంగళవారం ఉదయం ఇంట్లో అందరికి టీ ఇవ్వమని అత్తగారు పురమాయించడంతో ఇదే అదునుగా భావించింది. ఆ టీ లో తాను పుట్టింటి నుంచి తెచ్చిన విషాన్ని కలిపి ఇంట్లోవారందరికి ఇచ్చింది. అయితే అనిత అత్తమామలతో పాటు, అదే ఊరిలో ఉండే పూరన్ సోదరి, సోదరుడు, ఏడాదిన్నర వయసున్న పూరన్ సోదరి కొడుకు కూడా ఆరోజు ఇంటికి రావడంతో వారికి కూడా విషం కలిపిన టీ ఇచ్చింది.

ఆ టీ తాగిన కొద్దిసేపటికే పూరన్ సోదరి కొడుకు రక్తం కక్కుకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, అదే రోజు ఉదయం భర్త బయటికి వెళ్లడంతో ప్రాణాలు దక్కాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలాన్నీ పరిశీలించి, కుటుంబ సభ్యులు తాగిన టీ ని టెస్ట్ చేయగా అనిత బండారం బయటపడింది. తన భర్తతో పాటు, అతని కుటుంబంలో ఎవరూ తనకు నచ్చలేదని.. అందుకే అందరినీ చంపాలని నిర్ణయించుకుని టీలో విషం కలిపినట్లు అనిత ఒప్పుకోవడంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.

Next Story

Most Viewed