సొంత పార్టీపై జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు.. టీడీపీలో కలవరం

by  |
jc
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయమని కుండబద్దలుకొట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యకర్తలే టీడీపీని నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇకనైనా పార్టీ అధినేత చంద్రబాబు మేలుకోకపోతే భారీనష్టం జరగొచ్చని హెచ్చరించారు. అనంతపురంలో శనివారం జరిగిన రాయలసీమ టీడీపీ నేతల సమావేశంలో జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల విషయంలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జేసీ సీమ ప్రాజెక్టుల కంటే కార్యకర్తలను కాపాడాలని హితవు పలికారు.

ప్రాజెక్టులపై పోరాటంతో ఫలితం ఉండదని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్వ శ్రీనివాసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి కార్యక్రమాల వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభమేమీ ఉండదన్నారు. రెండేళ్ల నుంచి ఒక్క టీడీపీ కార్యకర్తను కూడా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కేవలం కాల్వ శ్రీనివాసులు కనుసన్నల్లోనే ఈ సదస్సు జరుగుతోంది. ఆయన వెంట అనంతపురం టీడీపీ నాయకులు గానీ కార్యకర్తలు గానీ లేరంటూ విరుచుకుపడ్డారు. సమాచారం ఇవ్వకుండానే సాగునీటి ప్రాజెక్టులపై సదస్సులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.

ఇప్పుడు నీటి ప్రాజెక్టులపై సదస్సులు అంటే కార్యకర్తలు వస్తారా అని ప్రశ్నించారు. సదస్సులు కార్యకర్తల సాధక బాధకాలపై పెట్టాలంటూ హితవు పలికారు. అనంతపురం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట అన్న జేసీ ఇతర నాయకులు దానిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది కాబట్టి తాము నాయకులమయ్యామని చెప్పుకొచ్చారు. కార్యకర్తల కోసం మీటింగ్ లు పెట్టాలి గానీ ఇలాంటి పనికిరాని సదస్సులు శుద్ధ దండగే అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు.

Next Story

Most Viewed