డిమాండ్ తీర్చేందుకు రెండో తయారీ ప్లాంట్.. ఆథర్ ఎనర్జీ!

by  |
డిమాండ్ తీర్చేందుకు రెండో తయారీ ప్లాంట్.. ఆథర్ ఎనర్జీ!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఆథర్ ఎనర్జీ త్వరలో తన రెండో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. కంపెనీ ఇప్పటికే భారత మార్కెట్లో విడుదల చేసిన 450 ఎక్స్, 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం గిరాకీ అధికంగా ఉందని, వినియోగదారులకు అవసరమైన స్థాయిలో ఈ-స్కూటర్లను అందించేందుకు తమిళనాడులోని హోసూర్‌లో కొత్త ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా కంపెనీ ప్రస్తుతం ఏడాదికి 1.20 లక్షలుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 లక్షల వాహనాలకు విస్తరించనున్నట్టు కంపెనీ వివరించింది.

ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) తయారీతో పాటు కొత్త తయారీ యూనిట్‌లో లిథియం-అయాన్ బ్యాటరీలపై కూడా దృష్టి సారిస్తామని, సామర్థ్య విస్తరణతో పాటు వచ్చే ఏడాది నాటికి దేశంలో అతిపెద్ద ఈవీ ఉత్పత్తిదారుగా నిలవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని’ ఆథర్ ఎనర్జీ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ తరుణ్ మెహతా అన్నారు. కంపెనీ అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి సాధిస్తోందని, గత సంవత్సరం కంటే 12 రెట్లు అధిక అమ్మకాలు సాధించిందని కంపెనీ తెలిపింది. డిమాండ్‌కు అనుగుణంగా కార్యకలాపాలు, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు రాబోయే ఐదేళ్లలో రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.



Next Story

Most Viewed