ఏ మూల దాక్కున్నా లాగి లాగి వడ్డీతో సహా చెల్లిస్తాం: అచ్చెన్నాయుడు

by  |
Acchennayudu-1
X

దిశ, ఏపీ బ్యూరో: ‘తప్పు చేసిన ఏ ఒక్కరినీ వదలం.. అధికారంలోకి రాగానే ఏ మూల దాక్కున్నా లాగి లాగి వడ్డీతో సహా చెల్లిస్తాం. తెలుగుదేశం కార్యకర్తలు పోలీసులకు భయపడేది లేదు’అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరుతో చంద్రబాబు చేపట్టిన దీక్షలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మాదకద్రవ్యాల కేంద్రంగా మారుతోందనే ఆవేదనతో తెలుగుదేశం పోరాడుతుంటే వైసీపీ నేతలు దాడికి దిగుతున్నారని ఆరోపించారు.

పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు అచ్చెన్నాయుడు నివాళులర్పించారు. అనంతరం ప్రాణ త్యాగం చేసిన పోలీసుల ఆత్మలు ఈ డీజీపీ తీరుతో ఘోషిస్తాయని విమర్శించారు. రెండున్నరేళ్లలో డీజీపీ పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి, వైసీపీ నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు పట్ల ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్, డీజీపీ గౌతం సవాంగ్ కలిసి కుట్రపన్ని తొలుత చంద్రబాబు నివాసం పైకి దాడికి యత్నించారని తర్వాత పార్టీ కార్యాలయంపైనే దాడి చేశారని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్లుగా టీడీపీ నేతల ఆర్ధిక మూలాలని దెబ్బకొడుతూ ఈ ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోందని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం అని వ్యాఖ్యానించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఈ రీతిలో జరగలేదన్న ఆయన సమాజ చైతన్యం కోసమే ఈ 36గంటల దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు సర్వేల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమవటంతో వైసీపీ ప్రతి దీక్షలకు దిగుతోందన్నారు. రాష్ట్రంలో లభ్యమయ్యే నాసిరకం మద్యంలో మాదకద్రవ్యాలు కలుపుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి గంజాయి కొత్త కాదని డీజీపీ మాట్లాడటం దుర్మార్గమంటూ విరుచుకుపడ్డారు.

Next Story