పైన్ వల్లే మేం గబ్బాలో గెలిచాం : అశ్విన్

by  |
పైన్ వల్లే మేం గబ్బాలో గెలిచాం : అశ్విన్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ వల్లే గబ్బా టెస్టులో గెలిచామని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెటైరికల్ కామెంట్ చేశాడు. అతడే లేకపోతే మేం గబ్బాలో మ్యాచ్ గెలిచే వాళ్లమే కాదంటూ ఎద్దేవా చేశాడు. కీలక మ్యాచ్‌లో యువ క్రికెటర్లు బాగా రాణించి విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. కానీ అంతకు మించిన కారణం మరొకటి కూడా ఉందని అశ్విన్ అన్నాడు. ‘టీమ్ ఇండియాకు టిమ్ పైన్ సాయం చేయడం వల్ల గెలుపు సాధ్యమైంది. గబ్బా టెస్టులో అతడు ఎన్నో అవకాశాలను ఇచ్చాడు. అతడు వదిలిన క్యాచ్‌లు, చేయని స్టంపింగ్స్ కలసి వచ్చాయి. రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్‌ను స్టంపింగ్ చేసే అవకాశం వచ్చినా జారవిడిచాడు.

అదే మమ్మల్ని విజయం వైపు తీసుకొని వెళ్లింది’ అని అశ్విన్ సెటైర్లు వేశాడు. అశ్విన్ చెప్పినట్లు రిషబ్ పంత్‌కు లైఫ్ వచ్చిన తర్వాతే భారీ స్కోరు చేశాడు. 89 పరుగులు చేసి గబ్బాలో విజయం అందించాడు. కాగా అంతకు ముందు సిడ్నీ టెస్టులో పైన్ – అశ్విన్ మధ్య మాటల యుద్దం సాగింది. అశ్విన్ బ్యాటింగ్ చేస్తుండగా కీపింగ్ చేస్తున్న పైన్ పదే పదే విసిగించాడు. అంతే కాకుండా గబ్బా వస్తే చూసుకుందాం అంటూ సవాలు కూడా విసిరాడు. ఆ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొనే తాజాగా అశ్విన్ సెటైర్లు వేశాడు.


Next Story

Most Viewed