అన్ని చికిత్సలకు గాంధీ ‘కేరాఫ్‌’.. ?

by  |
అన్ని చికిత్సలకు గాంధీ ‘కేరాఫ్‌’.. ?
X

దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లు భారీగా తగ్గిపోయారు. దీంతో అన్ని చికిత్సలు అందించేందుకు ఆస్పత్రి సిబ్బంది సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే తగిన చర్యలు చేపడుతామని ఆసుపత్రి సిబ్బంది తెలుపుతున్నారు. ప్రస్తుతం ఐసీయు వార్డులో మాత్రమే ఎక్కువగా 475 మంది రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. గాంధీ లో మొత్తం 1869 బెడ్లు ఉండగా 506 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. కరోనా వ్యాధి ప్రబలడం‌తో ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా చికిత్సలకు మాత్రమే పరిమితం చేసింది. హైదరాబాద్‌లో గాంధీతో పాటు కింగ్ కోటి, టిమ్స్ ఆసుపత్రులను కరోనా చికిత్సల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు భారీగా తగ్గిపోవడంతో గాంధీ‌లో అన్ని రకాల చికిత్సలు అందించేందుకు ఆసుపత్రి సిబ్బంది ఆలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అన్ని రకాల సేవలు అందించనున్నారు.

గాంధీ లో 1869 బెడ్లలో 506 మందికి చికిత్సలు

గాంధీ ఆసుపత్రిలో మొత్తం 1869 బెడ్లు ఉండగా కేవలం 506 మంది పేషేంట్ల మాత్రమే చికిత్సలు పొందుతున్నారు. జనరల్ బెడ్లు 650 ఉండగా వీటిలో 631 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. కేవలం 19 మంది మాత్రమే చికిత్సలు పొందుతున్నారు. ఆక్సిజన్ బెడ్లు 600 ఉండగా 12 మంది మాత్రమే చికిత్సలు పొందుతుండగా 475 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఐసీయూ వార్డులో 619 బెడ్లు ఉండగా వీటిలో ఎక్కువ గా 474 మంది పొందుతుండగా 145 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల పేషెంట్లకు చికిత్సలు అందించేందుకు ఆసుపత్రి సిబ్బంది సిద్ధం అవుతున్నారు.

రెండు నెలలుగా నిలిచిన అన్ని రకాల సేవలు

దాదాపుగా రెండు నెలల నుంచి గాంధీ లో అన్ని రకాల సేవలు నిలిపివేసి కేవలం కరోనా, బ్లాక్ ఫంగస్ రోగాలకు మాత్రమే చికిత్సలు అందిస్తున్నారు. దీంతో పేద ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. చాలా వరకు డయాలసిస్ పేషెంట్లకు, గర్భిణీలకు కు, డెలివరీలకు, చిన్న పిల్లల చికిత్సల కోసం ఇతర ప్రైవేట్ ఆసుపత్రులను సంప్రదించాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితుల చికిత్సలు, ఆక్సిడెంట్ కేసులు కూడా ఇతర ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఉస్మానియా ఆసుపత్రికి చికిత్స కోసం పేషేంట్ల తాకిడి పెరిగింది. గాంధీలో తిరిగి అన్ని రకాల చికిత్సలు నిర్వహించడం ద్వారా పేద ప్రజలకు మేలు చేకూరనుంది.



Next Story

Most Viewed