ఒకే గొడుగు కిందకు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌?

by  |
Arogyasree, Ayushman
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ స్కీంను అమలు చేయాల్సిందేనని వైద్యారోగ్యశాఖ హెచ్ఓడీలు(హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్) ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, దీని వలన పేదలకు ఎంతో నష్టం జరుగుతుందని వివరించారు. ఆయుష్మాన్ భారత్ స్కీంలో కరోనాతో పాటు ఆరోగ్య శ్రీలో లేని అనేక వ్యాధుల చికిత్స ప్రోసీజర్స్ ఉండటం వలన ప్రజలు లాభం చేకూరుతుందన్నారు. తద్వారా రాష్ర్టానికి సుమారు రూ.200 కోట్ల ప్రయోజనం ఉంటుందని వివరించారు. ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ స్కీంలను ఇంజెక్ట్(కలపడం) చేయడం వలన రెండింటిలో ఉన్న చికిత్స ప్రోసీజర్స్ అనుసంధానం అవుతాయన్నారు. దీంతో ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సలు కొత్తగా కలుస్తాయని హెచ్ఓడీలు ప్రభుత్వానికి వివరించారు. తద్వారా దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

గవర్నమెంట్ ఆస్పత్రుల్లో ఫస్ట్…

ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను మొదట ప్రభుత్వ దవాఖాన్లలో అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోన్నట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ మేరకు అధికారుల నుంచి ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నది. అంతేగాక రెండు స్కీంలు కలయికతో వచ్చే సమస్యలు, సాధ్యసాధ్యాలపై గవర్నమెంట్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లు, డాక్టర్లు, టెక్నీషియన్లకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కార్యాలయంలో శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఆయుష్మాన్, ఆరోగ్యశ్రీ కలిపి అమలు చేసేందుకు రూపొందించిన రూల్స్‌, సాంకేతికతపై ఆరోగ్యశ్రీ ఆఫీసర్లు అవగాహన కల్పిస్తున్నారు.

పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే లక్ష్యం…

ఆరోగ్యశ్రీకి, ఆయుష్మాన్ భారత్‌కు తేడాలు ఉన్నా, ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో పేదలకు ఉచితంగా వైద్యం అందించడమే రెండింటి ప్రధాన ఉద్దేశమని ఆఫీసర్లు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల వరకూ ఉచిత వైద్యం అందుతుండగా, ఆయుష్మాన్‌లో కలిస్తే రూ.5 లక్షల వరకు స్కీం వర్తిస్తుందని అధికారులు అనాధికారికంగా తెలిపారు. అంతేగాక ఆరోగ్యశ్రీలో 972 రకాల ట్రీట్‌మెంట్ ప్రొసీజర్స్ కవర్ అవుతుండగా, ఆయుష్మాన్‌లో 1,350 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఆయుష్మాన్‌లో లేని 540 ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆరోగ్యశ్రీలో లేని 685 ప్రొసీజర్స్ ఆయుష్మాన్‌లో ఉన్నాయి. దీంతో ఈ రెండింటిని ఇంజెక్ట్(కలుపడం) ప్రజలకు మేలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. దీంతో ఆ స్కీంను వేగంగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఉదాహరణకు డెంగీ, మలేరియా వంటి వాటికి ఆరోగ్యశ్రీ వర్తించదు. కానీ ఆయుష్మాన్ వర్తిస్తోంది. కిడ్నీ, లివర్ మార్పిడులు ఆరోగ్యశ్రీలో ఉండగా, ఆయుష్మాన్‌లో లేవు. ఈ రెండు స్కీంలు కలిపితే అన్ని చికిత్సలు ఒకే గొడుగు కిందకి వస్తాయి. మొత్తానికి రెండింటినీ కలిపి అమలు చేస్తే రాష్ట్ర ప్రజలకు 1,887 రకాల చికిత్సలకు ఉచిత వైద్యం లభిస్తుందని అధికారులు అంటున్నారు.

26.11 లక్షల కుటుంబాలకు మేలు..

తెల్ల రేషన్ కార్డుదారులందరికీ ఆరోగ్యశ్రీ వర్తిస్తుండగా, సోషియో ఎకనామిక్ కాస్ట్ లెక్కల ప్రకారం ఆయుష్మాన్ స్కీం కొరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ప్రస్తుతానికి దీనిలో రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 26.11 లక్షల కుటుంబాలు కవర్ అవుతున్నాయి. కానీ ఇది ఆరోగ్యశ్రీ కంటే చాలా తక్కువ. ఆరోగ్యశ్రీలో 77.19 లక్షల కుటుంబాలకు వర్తిస్తాయి. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కోసం ఏటా సగటున రూ.700 కోట్లు ఖర్చు అవుతున్నాయి. ఆయుష్మాన్ అమలు చేస్తే 26.11 లక్షల కుటుంబాల కోసం సుమారు రూ.200 కోట్ల వరకూ కేంద్రమే భరిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ 26.11 లక్షల కుటుంబాలు దేశంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణ వాళ్లకు, తెలంగాణలో ఉంటున్న ఇతర రాష్ట్రాల వాళ్లకూ దీని వలన మేలు జరుగుతుంది.

వచ్చే నెల మొదటి వారంలో ప్రైవేట్ హాస్పిటళ్లతో సమావేశం…

ఆరోగ్య శ్రీ, ఆయూష్మాన్ స్కీంల ఇంజెక్ట్ పై వచ్చే నెల మొదటి వారంలో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అధికారులు ప్రైవేట్ హాస్పిటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించనున్నారు. అయితే, రెండూ కలిపి అమలు చేయడంపై కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు అభ్యంతరాలు చెబుతున్నట్లు ట్రస్ట్ ఆఫీసర్లు అప్ ది రికార్డులో చెబుతున్నారు. అయితే ఆయా అభ్యంతరాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇచ్చాకే ఆయుష్మాన్ అమలుపై నిర్ణయం తీసుకుంటామని ప్రైవేటు యాజమాన్యాలు చెబుతున్నాయి.

వాస్తవానికి ఆయుష్మాన్ స్కీంలో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ట్రీట్‌మెంట్ కోసం వస్తే, వాళ్లకే ఆయుష్మాన్ భారత్ కిందనే ట్రీట్‌మెంట్ ఇస్తారు. ఆయుష్మాన్‌లో లేని రోగాలకు, ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తారు. ఆయుష్మాన్ పరిధిలోకి రానివాళ్లకు ఇప్పటిలాగే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్‌మెంట్ అందిస్తారు. ఆయుష్మాన్‌లో ట్రీట్‌మెంట్ ప్యాకేజీల ధరలు, ఆరోగ్యశ్రీ ప్యాకేజీల కంటే తక్కువగా ఉన్నాయి. దీంతో ఆరోగ్యశ్రీ పేషెంట్‌కు ఆయుష్మాన్‌ కింద చికిత్స అందించేందుకు ప్రైవేటు యాజమాన్యాలు ప్రధానంగా అభ్యంతరం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఇచ్చే డబ్బులకు, అదనంగా కలిపి, ఆరోగ్యశ్రీకి చెల్లిస్తున్నట్లే ఇవ్వాలని ప్రైవేటు యాజమాన్యాలు కోరుతున్నట్లు సమాచారం.



Next Story