ప్రభుత్వ ఉద్యోగుల నిరసనలకు ఏపీఎస్ ఆర్టీసీ మద్దతు

by  |
apsrtc
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగ సంఘాల ఆందోళనలకు ఆర్టీసీ ఉద్యోగులు సైతం మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆర్టీసీలోని ప్రధాన కార్మిక సంఘం ఎంప్లాయిస్ యూనియన్ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం నుంచి ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొంటారని ప్రకటించింది.

ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు సంఘం ప్రధాన కార్యదర్శి దామోదర్‌రావు లేఖ రాశారు. పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు సహా ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిందని లేఖలో పేర్కొన్నారు. జేఏసీ పిలుపు మేరకు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటారని ఈయూ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం నుంచి దశల వారీగా జరిగే ఆందోళనలో ఆర్టీసీ ఉద్యోగులంతా పాల్గొంటారని తెలిపారు. ఆందోళన కార్యక్రమాల షెడ్యూల్​ను ఆర్టీసీ ఎండీకి పంపినట్లు ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదరరావు లేఖలో పేర్కొన్నారు.

Next Story