ఏప్రిల్‌లో 38 శాతం పెరిగిన ఎఫ్‌డీఐలు

by  |
ఏప్రిల్‌లో 38 శాతం పెరిగిన ఎఫ్‌డీఐలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లోకి మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్‌లో 38 శాతం పెరిగి 6.24 బిలియన్ డాలర్ల(రూ. 46 వేల కోట్ల)కు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో ఎఫ్‌డీఐల మొత్తం 4.53 బిలియన్ డాలర్లు(రూ. 33.5 వేల కోట్లుగా నమోదైంది. సమీక్షించిన నెలలో ఈక్విటీ రూపంలో వచ్చిన పెట్టుబడులు ఏకంగా 60 శాతం పెరిగి 4.44 బిలియన్ డాలర్ల(రూ. 32.9 వేల కోట్ల)కు చేరుకుంది. గతేడాది ఇదే నెలలో ఈక్విటీ ఎఫ్‌డీఐ 2.77 బిలియన్ డాలర్లు(రూ. 20.5 వేల కోట్లు)గా నమోదైంది. ఎఫ్‌డీఐ విధాన సంస్కరణలు, పెట్టుబడుల సదుపాయాలు, వ్యాపార అనుకూలత వంటి కీలక చర్యలను ప్రభుత్వం తీసుకోవడంతో ఎఫ్‌డీఐ ప్రవాహం పెరిగినట్టు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

ఏప్రిల్ నెలలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన దేశంగా మారిషస్ 24 శాతం వాటాతో ముందు వరుసలో నిలవగా, తర్వాత సింగపూర్ 21 శాతం, జపాన్ 11 శాతం కలిగి ఉన్నాయి. రంగాల వారీగా చూస్తే.. కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లో ఎఫ్‌డీఐ ఈక్విటీ పెట్టుబడులు 24 శాతం కలిగి ఉన్నాయి. తర్వాత సేవల రంగం 23 శాతం, విద్యా రంగం 8 శాతంతో ఉన్నాయి. ఎక్కువ పెట్టుబడులను సాధించిన రాష్ట్రాల్లో 31 శాతంతో కర్ణాటక ముందుంది.



Next Story