లంచం తీసుకున్న కేసులో ఏపీవోకు ఏడాది జైలు శిక్ష

by  |
లంచం తీసుకున్న కేసులో ఏపీవోకు ఏడాది జైలు శిక్ష
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తన కారుకు సంబంధించిన అద్దె చెల్లించడానికి డ్రైవర్ వద్ద లంచం తీసుకున్న అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్‌కు ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ కరీంనగర్ ఏసీబీ న్యాయమూర్తి వీరయ్య తీర్పు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లాలో కమ్యూనిటీ బేస్‌డ్ ట్యాంక్ మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ ప్రాజెక్టు యూనిట్‌లో అల్తీ శంకర్ రావు ఏపీవోగా పని చేస్తుండేవారు. అతనికి (AP25TV0826) కారును ప్రాజెక్టు వారు అద్దెకు సమకూర్చారు. డిచ్‌పల్లి మండలం ధర్మారంకు చెందిన సోంపల్లి సురేష్ దాని డ్రైవర్-కం ఓనర్‌గా రెండు నెలల పాటు శంకర్ రావు వద్ద పనిచేశారు.

అందుకు సంబంధించిన కారు అద్దె రూ.34 వేలు రావాల్సి ఉండగా దాని అద్దె వివరాలను ఈఈకి పంపడానికి రూ.1500 లంచాన్ని డిమాండ్ చేశారు. బాధితుడు సురేష్ ఏసీబీని ఆశ్రయించగా 2009 అక్టోబర్ 6న అల్తీ శ్రీనివాస్ రావును లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు రిమాండ్‌కు పంపారు. ఈ కేసులో శుక్రవారం కరీంనగర్ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి వీరయ్య ఇరుపక్షాల వాదనలు విని ఏపీవో అల్తీ శంకర్ రావుకు ఏడాది కఠిన కారాగార జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించారు.



Next Story

Most Viewed