జులైలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం?

by  |
జులైలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం?
X

దిశ, న్యూస్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం కన్నేసింది. వచ్చేనెలలో అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించాలని పట్టు మీదుంది. కచ్చితంగా వివరాలన్నీ సేకరించి, ఇరు రాష్ట్రాల మధ్య జరుగుతున్న జల వివాదాలను అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏతో వీడియో కాన్ఫరెన్స్, హైడ్రాలజీ ఇన్‌స్ట్యిట్యూట్‌తో పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ మంగళవారం కృష్ణా బోర్డుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కేఆర్ఎంబీ ఛైర్మన్ పరమేశంతో పాటు ఇతర అధికారులతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సెక్రెటరీ ఏకే సిన్హా సుదీర్ఘంగా చర్చించారు. గతంలో లేని విధంగా బోర్డుతో చాలా అంశాలను ప్రస్తావించారు. ఇటీవల నిర్వహించిన బోర్డు సమావేశంపై పూర్తి వివరాలను తీసుకున్నారు. ఏపీ, తెలంగాణ వాదనలు, బోర్డు పరిధిలోని ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించినట్లు సమాచారం. గతంలో ఉమాభారతి నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అయితే ఈసారి మాత్రం సీరియస్‌గా అపెక్స్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు నదులపై రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, నీటి వినియోగం, వరద జలాలు, మిగులు జలాల లెక్కలు, వరద సమయాల్లో సముద్రంలో కలుస్తున్ననీటి అంశాలపై పూర్తిస్థాయిలో లెక్కలేస్తున్నారు. వీటికి సంబంధించిన పలు అంశాలను వీడియో కాన్ఫరెన్స్‌ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో అపెక్స్ కౌన్సిల్ ఉంటుందని, దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించినట్లు సమాచారం. అజెండా అంశాలపై కసరత్తు చేయాలని, అజెండా అంశాలు, ప్రతిపాదిత అంశాలను కేంద్రానికి పంపించాలని సూచించారు. గోదావరి, కృష్ణా నదుల నీటి అంశాల్లో కేంద్రం సమగ్రమైన వివరాలు సేకరిస్తోంది.

వాస్తవంగా ఈ నెలాఖరు వరకు అపెక్స్ కౌన్సిల్ నిర్వహించే అవకాశాలు చూస్తున్నామని, ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులను అంచనా వేసి త్వరలోనే తేదీ ఖరారు చేస్తామని జలశక్తి సెక్రెటరీ సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. ఈ లోగా మొత్తం రెండు రాష్ట్రాల పరిధిలో ప్రాజెక్టుల వివరాలన్నీ తీసుకోవాలని బోర్డుకు సూచించారు. అయితే ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వడంలో రెండు రాష్ట్రాలు వెనకాడుతున్న విషయాన్ని సైతం కేంద్రానికి వివరించారు. గోదావరి బోర్డు తరహాలో నిర్ణీత తేదీలో డీపీఆర్‌లు ఇవ్వాలని రాష్ట్రాలకు లేఖలు పంపించాలని సూచించినట్లు చెబుతున్నారు. ఈసారి నిర్వహించే అపెక్స్ కౌన్సిల్‌లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన జలాలపై కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్నిప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే ప్రతి ప్రాజెక్టు, రిజర్వాయరు, నీటి తరలింపు, ఆయకట్టు వివరాలన్నీ సమగ్రంగా సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో ఈ అంశాలపైనే చర్చించారు. అయితే చర్చించిన అంశాలన్నీ రహస్యంగా ఉండాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పక్కా ఆదేశాలు జారీ చేసింది.

Next Story