ఏపీలో ఇకపై ఆఫ్‌లైన్‌లోనే ప్రభుత్వ ఉత్తర్వులు

by  |
ap-govt
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో ఉంచకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు సమాచారం ఇచ్చింది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను ఆఫ్‌లైన్‌లో మాత్రమే ఉంచాలని.. ఆన్‌లైన్‌లో ఉంచొద్దని జీఏడీ ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇకపోతే ఏపీలో జీవోలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. రాత్రికి రాత్రే ప్రభుత్వం బ్లాంక్‌ జీవోలు జారీ చేస్తోందని ఆరోపించింది.

రాష్ట్ర ప్రభుత్వం సాధారణ పరిపాలన శాఖకు సంబంధించి ఇటీవలే 14 జీవోలను విడుదల చేయగా వాటిలో 10 జీవోలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో బ్లాంక్‌గానే ఉంచింది. అధికారుల బదిలీలు, పర్యటనలు, వారి ఇంటి అద్దె భత్యాల చెల్లింపు వంటి అనేక జీవోలను సైతం బ్లాంక్‌గా ఉంచింది. ఈ వ్యవహారంపై టీడీపీ రాద్ధాంతం చేసింది. మొన్నటి వరకూ షెల్ కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలతో ఆర్థిక నేరాలకు పాల్పడిన సీఎం జగన్ ఇప్పుడు తాజాగా బ్లాంక్ జీవోలతో కొత్త పంథాను అనుసరిస్తున్నారంటూ మండిపడింది. అంతేకాదు బ్లాంక్ జీవోలపై గవర్నర్ బీబీ హరిచందన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed