రాజ్ భవన్‌లో ‘ ఎట్ హోమ్ ‘ రద్దు

by  |
athome
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ రద్దు చేసినట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. కరోనా ప్రభావంతో ఎట్ హోమ్ ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు గవర్నర్‌ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గవర్నర్ ‘ఎట్ హోమ్’ కార్యక్రమాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ముఖ్యమంత్రి, మంత్రులు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్వాతంత్ర్య సమరయోధులు, అవార్డు విజేతలు, మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా పాల్గొనేవారు.

కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రస్తుత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించరాదని గవర్నర్ ఆదేశించినట్లు ముఖేష్ కుమార్ మీనా వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం వంటి కరోనా జాగ్రత్తలు పాటించటం ద్వారా కొవిడ్ నుండి రక్షణ పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అర్హులైన వారందరూ ప్రాధాన్యత ఆధారంగా టీకాలు వేయించుకోవాలని, కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కొవిడ్ నిబంధనలను పాటించాలని గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కోరారు.



Next Story