జగన్ సర్కార్‌పై హైకోర్టు మళ్లీ ఆగ్రహం.. ఎందుకంటే ?

by  |
ap-high-court,
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో బిల్లులు చెల్లించి హైకోర్టుకు నివేదిక ఇవ్వాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. బిల్లులు చెల్లించకపోవడం పిటిషనర్ల జీవించే హక్కును హరించడమేనని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే గౌరవంతో జీవించడమన్నారు. చేసిన పనులకు బిల్లులను చెల్లించమని హైకోర్టు ఇప్పటికే చెప్పినా ప్రభుత్వం ఖాతరు చేయలేదని హైకోర్టులో వాదనలు వినిపించారు.

అప్పుకు వడ్డీలు కట్టలేక, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక కాంట్రాక్టర్లు ఇబ్బందిపడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నరేగా పనులకు నిధులు చెల్లించామని, తమ వద్ద బకాయిలు లేవని అఫిడవిట్‌లో చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం డబ్బు రాలేదని చెబుతోంది.. ఈ రెండు పరస్పర విరుద్ధమయిన అంశాలని అన్నారు. గతంలో బిల్లులు చెల్లిస్తామని ఏజీ హామీ ఇచ్చినప్పటికీ చెల్లింపులు జరగకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ప్రభుత్వ వైఖరిలో ఎప్పటికప్పుడు కేసు వాయిదా వేయించుకునేందుకే తాపత్రయం కనిపిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

బిల్లులు చెల్లించడం అంటే పంచాయతీ అకౌంట్లలో డబ్బులు వేయడం కాదు.. పిటిషనర్ల అకౌంట్లలో చెల్లించాలి. అది చెల్లించకుండా జాప్యం చేయడం క్షమించరాని అంశం అంటూ న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అభిప్రాయపడ్డారు. రెండు వారాల్లోపు 500 మంది పిటిషనర్లకు డబ్బు చెల్లించి తీరాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. చెల్లించాల్సిన డబ్బుకు వడ్డీ, 20 శాతం మినహాయింపును ప్రధాన పిటిషన్ విచారణలో పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.

Next Story

Most Viewed