1400 కోట్లు జమ చేశాం.. 8 ఇళ్ల పట్టాలిస్తాం: జగన్

by  |
1400 కోట్లు జమ చేశాం.. 8 ఇళ్ల పట్టాలిస్తాం: జగన్
X

సెర్పె, మెప్మా ఖాతాల్లో 1400 కోట్ల రూపాయలు జమ చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కష్ట సమయంలో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల్లోని 90,37,254 మహిళలు సభ్యుల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడతన ఈ మొత్తం జమ చేశామని తెలిపారు.

ఏపీలో 2016 నుంచి సున్నా వడ్డీ పథకం నిలిచిపోయిందని ఆయన గుర్తు చేశారు. కష్టాలు వెన్నాడుతున్నా తాము ఇచ్చిన మాటకు కట్టుబడ్డామని తెలిపారు. ఈ పథకం ద్వరా ప్రతి డ్వాక్రా గ్రూప్‌లోని మహిళకు 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయల లబ్ది చేకూరుతుందని ఆయన అంచనా వేశారు. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం ఏడు జిల్లాల్లోని మహిళల రుణాలపై 7శాతం వడ్డీ బ్యాంకులు వసూలు చేస్తున్నాయని, మిగిలిన ఏడు జిల్లాల్లో 13 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని వెల్లడించారు.

మహిళలకు సహాయసహకారాలందించేందుకు సదా సిద్ధంగా ఉంటామని అన్నారు. జులై 8 వైఎస్సార్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఇళ్ల పట్టాలతో పాటు ఉచితంగా ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50% మహిళలకు చెందేలా చట్టాన్ని తెచ్చామని ఆయన చెప్పారు. అలాగే అత్యాచారాలపై కఠిన శిక్ష పడేలా దిశ చట్టాన్ని తీసుకొచ్చామని గుర్తుచేశారు. అంతటితో చేతులు దులుపుకోకుండా 13 దిశ పోలీస్‌స్టేషన్లతో పాటు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు కూడా తీసుకొచ్చామని చెప్పారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీస్‌ను నియమించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 11,000కు పైగా మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించామని ఆయన గుర్తుచేశారు. అంతేకాకుండా గ్రామ సచివాలయాల్లో 8 మంది మహిళా మిత్రలను ఏర్పాటు చేశామని చెప్పారు. పీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా తల్లుల అకౌంట్‌లో పడేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. మహిళల చేతిలో డబ్బు పెడితే.. పూర్తిగా సద్వినియోగం అవుతుందని ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు. అమ్మఒడి పథకం ద్వారా 82 లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు.

tags:ap, ap cm, ysrcp, jagan, 0 interest loans, dwcra, serp, mepma, ladies

Next Story

Most Viewed