ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి కుదిరిన ముహూర్తం

by  |
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి కుదిరిన ముహూర్తం
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం కుదిరింది. జూలై 8న పంపిణీ చేపట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన స్పందన రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ అత్యంత ప్రాధాన్యతా అంశమని ఆయన చెప్పారు. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు.

లబ్ధిదారుల జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి:

ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే లాటరీ అనంతరం ఇళ్ల పట్టాల లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని సూచించారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తరువాత గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. ఆ పర్యటనలో తాను ప్రజలను సమస్యల గురించి ప్రశ్నించేటప్పుడు ఒక్క చెయ్యి కూడా లేవకూడదని సూచించారు. ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే దానికి అధికారులే బాధ్యత వహించాలని తెలిపారు. పూర్తి పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్లపట్టాలను పంపిణీ చేయాలని ఆదేశించారు. పెన్షన్‌, రేషన్ కార్డులు 10 రోజుల్లో, ఆరోగ్యశ్రీ కార్డు 20 రోజుల్లో, ఇంటి పట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అర్హులకు అందజేయాలని జగన్ సూచించారు. గ్రామల్లోని ప్రజలకు ఉపాధి హామీ కింద భారీగా పనులు కల్పించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి స్థలాలు గుర్తించి, సంబంధిత శాఖలకు సమాచారమిస్తే వారు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31లోగా ఈ భవనాల నిర్మాణాలన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.

‘నాడు-నేడు’ కింద 55వేల అంగన్వాడీల అభివృద్ధి:

55 వేల అంగన్వాడీలను ‘నాడు-నేడు’ కింద అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పాత భవనాల మరమ్మతులు, కొత్త భవన నిర్మాణ పనులు చేస్తామని అన్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంపుకోసం‘జగనన్న పచ్చతోరణం’ కింద 6కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జగన్ అధికారులకు తెలిపారు. ఖాళీ స్థలాల్లో, ఇంటర్నల్‌ రోడ్లు, అప్రోచ్‌ రోడ్లు వంటి చోట్ల, కొత్తగా ఇళ్ల పట్టాలు ఇవ్వనున్న ప్రాంతాల్లోని లే అవుట్లలో బాగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి పట్టాదారుకి నాలుగు మొక్కలు ఇవ్వాలని సూచించారు. ప్రతి పట్టణ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల రేడియస్‌లో వార్డు క్లినిక్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ క్లినిక్స్‌కి 15 నిమిషాల నడకతో చేరుకోవాలని సూచించారు. ఇందుకోసం స్థలాలు సేకరించాలని చెప్పారు.

స్కూల్స్ సిద్ధం కావాలి

ఆగస్టు 3న స్కూళ్లు తెరుచుకోనున్న నేపథ్యంలో ‘నాడు-నేడు’ కార్యక్రమంలో భాగంగా స్కూళ్ల మరమ్మతులు, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంకా ఏవైనా స్కూళ్లలో పనులు ప్రారంభం కాకపోతే తక్షణం ప్రారంభించి, పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫర్నీచర్, ఫ్యాన్లు అన్ని స్కూళ్లకూ వస్తున్నాయనీ, స్కూళ్లు తెరిచేనాటికి పూర్తి చేయాలని చెప్పారు. అర్బన్‌ ప్రాంతాల్లో కాంపౌండ్‌ వాల్‌, టాయిలెట్ వంటి సౌకర్యాల కల్పనలో వెనుకబాటుతనం కనిపిస్తోందనీ, వెంటనే అధికారులతో సమన్వయం చేసుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. స్కూళ్లు ఆరంభమయ్యేసరికి పనులన్నీ పూర్తికావాలని ఆదేశించారు.

వర్షాకాలంలో ఇసుక కొరత రాకూడదు

వర్షాకాలం ఆరంభమైన సందర్భంగా ఇసుక కొరత రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి కాబోతున్న నేపథ్యంలో నిర్మాణ పనులు ఆరంభమయ్యే అవకాశం ఉందనీ, అందుకే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక కొరత రాకుండా చూడాలని ఆదేశించారు. 46.30లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ ఉన్నప్పటికీ 70లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను నిల్వ చేయాలని సూచించారు. దీనికి కేవలం ఇంకా రెండు వారాల వ్యవధి మాత్రమే ఉందని గుర్తుచేశారు. నదుల్లో నీటి ప్రవాహం మొదలైతే రీచ్‌లు నీట మునిగి ఇసుక దొరకదని గుర్తు చేశారు. శ్రీకాకుళంలో 20వేలు, తూర్పుగోదావరిలో 60వేలు, పశ్చిమగోదావరిలో 35వేలు, కృష్ణాలో 50వేలు, గుంటూరులో 40వేల మెట్రిక్ టన్నుల ఇసుక ఉత్పత్తి చేయాలని ఆదేశించారు.



Next Story

Most Viewed