విశాఖకు రాజధాని తరలించడం ఖాయం : మంత్రి బొత్స సత్యనారాయణ

by  |
విశాఖకు రాజధాని తరలించడం ఖాయం : మంత్రి బొత్స సత్యనారాయణ
X

దిశ, ఏపీ బ్యూరో: విశాఖకు రాజధాని తరలింపు ఖాయమని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ( రుడా ) నూతన భవనాన్ని తొలి చైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరావులు పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స, రాజధాని విశాఖకు తరలింపు ఖాయమని చెప్పుకొచ్చారు. సాంకేతిక సమస్యలపై కోర్టులను ఒప్పిస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబుకు, లోకేష్‌ అడ్రస్ ఎక్కడ అని నిలదీశారు. తనకంటూ ఓ అడ్రస్ ఉందని, వారికి అడ్రస్ లేదన్నారు. చంద్రబాబుకూ, లోకేష్‌కూ ఇళ్ళులెక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తున్నామంటూ ప్రక్కరాష్ట్రంలో ఉంటారా అని మంత్రి బొత్స నిలదీశారు. చంద్రబాబు ఇళ్లు ఎక్కడ ఉందో ప్రజలకు చెప్పగలరా అని ప్రశ్నించారు.

ప్రతిపక్షంలో ఉండగానే జగన్ తాడేపల్లిలో ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నారని చెప్పుకొచ్చారు. స్వరాష్ట్రంలో ఇళ్లు లేని చంద్రబాబు తమకు నీతులు, సుద్దులు చెబుతారా అంటూ ప్రశ్నించారు. అమరావతి కౌలు రైతులకు ముందుగానే కౌలు చెల్లిస్తున్నామని..దీనిపై రాద్ధాంతం అనవసరమన్నారు. మరోవైపు రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతోందని తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.


Next Story