ముగిసిన కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్

by  |
ముగిసిన కేబినెట్ మీటింగ్.. కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ సర్కార్
X

దిశ, ఏపీబ్యూరో : ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సచివాలయంలోని కేబినెట్ హాల్‌లో ఉదయం 11 గంటలకు సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో దాదాపు 39 అంశాలపై చర్చించారు. నవరత్నాల్లో భాగంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా పథకంపై చర్చించారు. ఇప్పటికే మెుదటి విడత ఆసరా పథకం నిధులు విడుదలైన తరుణంలో రెండో విడతపై చర్చించారు. అలాగే గృహనిర్మాణానికి సంబంధించిన రుణాలపై కూడా కేబినెట్ చర్చించింది. వైసీపీ ప్రభుత్వం దాదాపు 30 లక్షల మందికి ఇళ్లపట్టాలను పంపిణీ చేసింది. అయితే, వాటిలో 17లక్షల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.35వేలు అదనపు రుణ సౌకర్యం కల్పించే యోచనపై కూడా కేబినెట్ చర్చించింది.

3శాతం వడ్డీకే లబ్ధిదారులకు రూ.35వేలు లోన్ కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే పరిశ్రమలకు సంబంధించి భూ కేటాయింపులపై కూడా కేబినెట్ చర్చించింది. మరోవైపు విద్యా, వైద్య సంస్థల సదుపాయాల దాతల పేర్లు 20 ఏళ్లు పెట్టే ప్రతిపాదనను కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ప్రతిష్టాత్మకమైన మైనార్టీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. మరోవైపు ఎల్జీ పాలిమర్స్ భూముల్లో ప్లాస్టిక్ పరిశ్రమను తొలగించేందుకు ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది. అయితే, ఆ భూముల్లో పర్యావరణ అనుకూల, ప్రమాద రహిత పరిశ్రమను నెలకొల్పేందుకు ఎల్జీ పాలిమర్స్ యజమాన్యానికి అనుమతులు ఇచ్చింది.

విద్యార్థులకు గుడ్ న్యూస్..

రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నియామకానికి సంబంధించిన చట్ట సవరణకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ పొందేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయ వినియోగానికే 10 వేల మెగావాట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది. యూనిట్‌కు రూ. 2.49కు సరఫరా చేసేలా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు ఆర్‌అండ్‌బీకి చెందిన ఖాళీ స్థలాలు, భవనాలను ఆర్డీసీకి బదలాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రూ. 30.79 కోట్లతో మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు అమలుకు ఓకే చెప్పింది. మైక్రోసాఫ్ట్ సహకారంతో రాష్ట్రంలోని 1.62 లక్షల మంది విద్యార్ధులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇవ్వనుంది. అందులో భాగంగా రాష్ట్రంలోని 300 కాలేజీలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లల్లో 40 సర్టిఫికేషన్ కోర్సుల్లో మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


Next Story

Most Viewed