‘మోడీ మనిషిగా చెబుతున్నా.. అదే రాజధాని’

by  |
‘మోడీ మనిషిగా చెబుతున్నా.. అదే రాజధాని’
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినిధిగా తాను ఈ మాట చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తుళ్లూరులో భారతీయ కిసాన్‌ సంఘ్‌ సమావేశానికి సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాజధానిలో జరిగే అభివృద్ధి అంతా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేస్తున్న నిధులతోనే అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు మార్చినా కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రం అమరావతిలోనే ఉంటాయని ఆయన వెల్లడించారు. మోడీ అమరావతి వైపే ఉన్నారనడానికి నిదర్శనం ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణమేన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఏపీ బీజేపీ కార్యాలయం విజయవాడలోనే కడుతున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు. అమరావతి రైతులకు ఇచ్చిన ప్లాట్లన్నింటినీ రూ.2వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. అమరావతిలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని కోరారు. అంతేగాకుండా ‘‘ అమరావతే రాజధానిగా ఉంటుంది. మోదీ మనిషిగా చెబుతున్నా… నా మాటలు విశ్వసించండి’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



Next Story

Most Viewed