కాంగ్రెస్‌కు మరో భారీ షాక్

by  |
కాంగ్రెస్‌కు మరో భారీ షాక్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆగమాగంగా తయారైంది. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారింది. 2018 సాధారణ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయంకాగా, అప్పటి నుంచి పార్టీని పట్టించుకునే వాడే కరువయ్యారు. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్టీకి ఉమ్మ డి జిల్లా వ్యాప్తంగా బలమైన కార్యకర్తలు ఉన్నా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే నేత ఆ పార్టీలో ఒక్కరూ కనిపించడం లేదు. అడపాదడపా నిర్మల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి, మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆత్రం సక్కు టీఆర్ఎస్ లో చేరడంతో ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకుండాపోయారు. దీం తో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాలుగు జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై కథనం.

ఆదిలాబాద్ లో ఆగమామం

ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైం ది. జిల్లా అధ్యక్షుడు భార్గవ్ దేశ్ పాండే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మాజీ మంత్రి సీ రామచంద్రారెడ్డి వృద్ధాప్యంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా రు. కార్యకర్తలకు పెద్దదిక్కుగా ఉన్నప్పటికీ ఆయన ఇప్పుడు పార్టీ కోసం శ్రమించే పరిస్థితి లేదు. పీసీసీ కార్యదర్శి గం డ్రత్ సుజాత తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక మైనార్టీ నేత సిరాజుద్దీన్ పార్టీ కోసం రిస్క్ తీసుకుంటున్నారన్న పేరుంది. ఆయ నే ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం. బోథ్​నియోజకవర్గంలో పార్టీకి నాయకుడు లేరు. మాజీ ఎంపీ సోయం బాపురావు రాజీనామా చేసి బీజేపీ చేరగా, నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉనికే లేకుండా పోయింది. ఉట్నూర్ కేంద్రంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేతగా ఎదిగిన మాజీ ఎంపీ రాథో డ్ రమేశ్​ కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణ. ఒకానొక సమయంలో బీజేపీలో చేరుతారని కూడా ప్రచారం జరిగింది. అధినేతల ఒత్తిడితో వెనక్కి తగ్గినా ఎప్పుడో ఒకసారి ఆయన పొలిటికల్ జంప్ ఖాయమని పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది.

నిర్మల్ లో ఉండీ లేనట్టే

నిర్మల్ జిల్లాలో కూడా పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్టీ కొంత బలంగానే ఉం డేది. జిల్లాల విభజన తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఆ తరువాత నిర్మల్ జిల్లా కు అధ్యక్షుడిగా బైంసాకు చెందిన రామారావు పటేల్ ను నియమించారు. ఆయన పనితీరుపై కార్యకర్తల్లో నిరుత్సాహం ఉంది. వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ పార్టీ కోసం పది శాతం కూడా కేటాయించరని విమర్శ ఉంది. ఇక మహేశ్వర్ రెడ్డి వెంట ఉన్న కేడర్​ చెదిరి పోలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత మేర పార్టీ ప్ర భావాన్ని చాటారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ప్రభావం ఉన్నప్పటికీ ఆయన కార్యకలాపాలకు దూరంగా ఉంటుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.

ఆసిఫాబాద్ లో ఒకే ఒక్కడు.

ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఆత్రం సక్కు అధికార పార్టీలో చేరడంతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో ఆ పార్టీకి అసలే కేడర్ లేకుండా పోయింది. జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు ఒక్కరే పార్టీ కార్యకలాపాలు నడుపుతున్నారు. కాగజ్ నగర్ నియోజకవర్గంలో పార్టీ నేత హరీశ్​కుమార్ కొంత బలంగా ఉన్నారు. జిల్లా పార్టీతో సంబంధం లేకుండా ఆయనే స్వయంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో పాటు అక్కడ ఎమ్మెల్యే కోనప్ప పై కొట్లాడుతున్నారు. ఆయన తండ్రి పురుషోత్తమరావు, తల్లి రాజ్యలక్ష్మి ఇద్దరూ గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారు. ఆ కుటుంబ నేపథ్యం ఇప్పుడు హరీశ్​కుమార్ కు పనికొస్తుంది. ఆదివాసులు ఎక్కువగా ఉండే జిల్లాలో వారి పట్ల నమ్మకం కలిగించే నేత లేడన్న అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో ఉంది.

మంచిర్యాలలో కాస్త నయం

మంచిర్యాల జిల్లాలో పార్టీ ఉనికి కోసం అక్కడి జిల్లా అధ్యక్షురాలు సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు కొంత సీరియస్ గానే పనిచేస్తున్నారు. అయితే పార్టీ ఆదేశించిన రీతిలో ప్రభుత్వ వ్యతిరేక విధానాల పై పోరాటం చేయడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మిగతా నియోజకవర్గాల తో పోలిస్తే ఆయన కొంత నయం అనిపించుకుంటున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటారన్న పేరుంది. ఆయన కూడా పార్టీ మారతారనే ప్రచారమూ జరిగింది. అయితే టీ ఆర్ఎస్ అధిష్టానం ఆయనకు రిజెక్ట్ చేయగా, బీజేపీ లో చేరాలా.. వద్దా.. అన్న సంశయం మేరకు ప్రేమ్ సాగర్ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ జిల్లాలోని చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో కనీసం పార్టీని నడిపే నేతలు లేరన్న అభిప్రాయాలు శ్రేణుల్లో ఉన్నాయి.

జవసత్వాలు వచ్చేనా..?

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ మళ్లీ జవసత్వాలు వస్తాయా .. లేదా.. అన్న ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. పార్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలమైన కార్యకర్తలు ఉన్నారు. తీవ్రమైన ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థ ల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలుపొందారు. ఆ తర్వాత వారు పార్టీని వీడి అధికార పార్టీలో చేరడం వేరే మాట. కానీ, పార్టీకి రూట్ లెవల్లో కార్యకర్తలు ఉన్నారన్నది వాస్తవం. తాజాగా బుధవారం హైదరాబాద్​లో జరిగిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో జిల్లా కార్యవర్గాల ను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. అలాగే పార్టీ అనుబంధ కార్యవర్గాలను కూడా భర్తీ చే యాలని సూచించారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు ఉమ్మ డి జిల్లాలో పార్టీకి జవసత్వాలు తీసుకువచ్చే నేత ఎవరన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నిర్మల్​కు చెందిన నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డికి పగ్గాలు అప్పగించాలని వివిధ నియోజకవర్గాల నేతలు అధిష్ఠానానికి సూచించినట్లు తెలుస్తోంది. ఆర్థికంగా బలంగా ఉండి, పార్టీ కోసం ఆయన సీరియస్ గా పని చేశారని ఈ సందర్భంగా వారు చెప్పినట్లు సమాచారం. మరోవైపు మంచిర్యాలకు చెందిన నేత ప్రేమ్ సాగర్ రావు కూ అవకాశం ఇవ్వాలని, ఆయన కూడా గతంలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారని మరో వర్గం అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణ యం తీసుకుంటుందో వేచి చూడాలి.

Next Story

Most Viewed