రియల్టర్స్‌ కీలక ప్రకటన.. తెలంగాణ ప్రభుత్వం ముందు మరో డిమాండ్

by  |
Digital survey Delay in Telangana
X

దిశ, తెలంగాణ బ్యూరో: పంచాయతీ లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయడం చట్ట వ్యతిరేకం కాదని, కొన్ని కేసుల్లో హైకోర్టు కూడా తీర్పునిచ్చిందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్​ అధ్యక్షుడు నారగోని ప్రవీణ్​కుమార్, వర్కింగ్​ ప్రెసిడెంట్​ మేకపోతుల నర్సయ్య అన్నారు. స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జారీ చేసిన సర్క్యులర్ చట్ట వ్యతిరేకమని, దాన్ని అమలు చేయడం లేదని వరంగల్ జిల్లాలో ఇద్దరు సబ్ ​రిజిస్ట్రార్లను సస్సెండ్ చేయడం తగదన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనను జారీ చేశారు. వెంటనే సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామని, సబ్ ​రిజిస్ట్రార్ ఆఫీసుల ముందే టెంట్లు వేసుకొని దీక్షలు చేస్తామని హెచ్చరించారు.

స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ గ్రామ పంచాయతీ లే అవుట్లలోని ప్లాట్లను రిజిస్టర్ చేయొద్దని జారీ చేసిన మెమో నం.జి2/257/2019 చట్ట ప్రకారం చెల్లదన్నారు. చట్టాన్ని అమలు చేయకుండా, కోర్టు తీర్పులను గౌరవించకుండా కాలయాపన చేస్తోన్న అధికారులను సస్పెండ్ చేయాలని, చట్టరీత్యా చెల్లని ఆదేశాలు ఇస్తున్న స్టాంప్స్ అండ్ ​రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ​చేశారు. కోర్టు తీర్పులను గతంలోనే ఐజీ దృష్టికి తీసుకెళ్తే.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారన్నారు. ఉన్నతస్థాయి అధికారులు పాలకుల అండ చూసుకొని వారి మెప్పు పొందడానికి సొంత లాభం కోసం కింది స్థాయి ఉద్యోగులను, ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉందని, ఇలాంటి చర్యల వల్ల మరింత పెరుగుతుందన్నారు. పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లను కొనుగోలు చేసిన లక్షలాది మంది రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. వారి సమస్యను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తు చేశారు.

epaper – 1:00 PM TS EDITION (20-11-21) చదవండి


Next Story