అంగన్వాడీ పాలు కాస్ట్లీ!

by  |
అంగన్వాడీ పాలు కాస్ట్లీ!
X

అంగన్వాడీల పాలు కాస్ట్లీగా మారాయి. కేంద్రప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలెప్‌మెంట్ సర్వీసెస్ (ఐసీడీఎస్) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని అంగన్వాడీలను నిర్వహిస్తోంది. వీటి నిర్వహణకు అవసరమయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 70/30 శాతం ప్రాతిపదికన భరిస్తున్నాయి. అంగన్వాడీలకు సరఫరా చేసే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పాల ధర పెంచాలని, లేని పక్షంలో సరఫరా కష్టమని తేల్చి చెప్పింది. దీంతో ఈ పాల ధరను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 51 వేల అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా లక్షలాది మంది గర్భిణులు, పిల్లలు, బాలింతలకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. ఇందులో భాగంగా పాలను కూడా వారికి అందిస్తోంది. అంగన్వాడీలకు రోజూ రెండు లక్షల లీటర్ల పాలు ప్రస్తుతం సరఫరా అవుతున్నాయి. ఇంత పెద్దమొత్తంలో పాలు సరఫరా చేయడం తమవల్ల కాదని విజయా డైరీ చేతులెత్తేయడంతో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి పాలను దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో గతంలోనే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ రవాణా ధరలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ విజ్ఞప్తిని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమ శాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ, పశుసంవర్థక శాఖలతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ సిఫారసుల మేరకు ఈ నెల 21 నుంచి అంగన్వాడీలకు సరఫరా చేసే లీటర్ పాలకు 47.25 రూపాయలుగా ధరను నిర్ణయించింది. అలాగే ఏజెన్సీలకు (గిరిజన ప్రాంతాలకు) సరఫరా చేసే లీటర్ పాల ధరను 53 రూపాయలుగా నిర్ణయించింది.

గతంలో లీటర్ పాలకు 42 రూపాయలు మాత్రమే చెల్లించేది. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీలకు సరఫరా చేసే పాలకు ఈ ధరను మాత్రమే చెల్లించేది. గతంలో బకాయి పడిన 77 కోట్ల రూపాయలను కూడా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చెల్లించాలన్న వినతి మేరకు 40 కోట్లను చెల్లించినట్టు శిశుసంక్షేమ శాఖ తెలిపింది. మిగిలిన మొత్తాన్ని కూడా త్వరలో చెల్లిస్తామని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్‌కు తెలిపింది.

Read also..

వాహ్ తాజ్.. వహా, నో ఎంట్రీ!


Next Story

Most Viewed