బీజేపీకి మద్దతివ్వడానికి వైసీపీకి సిగ్గుండాలి

by Thanuru Gopichand |   (  Updated:2025-08-22 05:47:20  IST  )

వైసీపీ ముసుగు మళ్ళీ తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది.

బీజేపీకి మద్దతివ్వడానికి వైసీపీకి సిగ్గుండాలి
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ‘వైసీపీ ముసుగు మళ్ళీ తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది. బీజేపీకి బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగింది. మోడీకి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి పక్షమేనని తేటతెల్లమైంది. బీజేపీ కోసమే పనిచేసే పక్షమేనని రుజువైంది..’ అంటూ ఏపీసీసీ చీఫ్​వైఎస్​షర్మిల ఆరోపణలు చేశారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్​.. ముగ్గురు మోడీ గారి తొత్తులే. బీజేపీకి ఊడిగం చేసే బానిసలే.. అని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పార్టీలది తెరమీద పొత్తు. వైసీపీది తెరవెనుక అక్రమ పొత్తు. వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ. ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ...’ అంటూ ఆమె ట్వీట్​చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలన్నారు. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అన్నారు.

5 ఏళ్లు దోచుకుతిన్నది దాచుకోడానికి బీజేపీకి జై కొట్టారని ఆరోపించారు. ఈ దేశంలో ఓట్ చోరితో రాజ్యాంగం ఖూనీ అయ్యేది వైసీపీకి కనిపించదు. మోడీ ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి వైసీపీ నోరు పెకలదు. మణిపూర్, గోద్రా అల్లర్లలో ఆర్​ఎస్​ఎస్​ చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారు. మోడీ గారి అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురించి మాత్రం ఉవ్వెత్తున లేస్తారు. మోడీ గారికి ఆపద వచ్చిందని అండగా నిలబడతారు. ఈ దేశ ప్రతి పక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన ఆర్​ఎస్​ఎస్​వాదికి మద్దతు ఇస్తారా ? ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటి ? అని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్​చేశారు.

Next Story