పల్నాడు జంటహత్యల కేసు.. ప్రధాన నిందితుడు వైసీపీ నేతే

by Naga Rani Yarlagadda |

పల్నాడు జిల్లాలో రెండ్రోజుల క్రితం కలకలం రేపిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు.

పల్నాడు జంటహత్యల కేసు.. ప్రధాన నిందితుడు వైసీపీ నేతే
X

దిశ, వెబ్‌డెస్క్: పల్నాడు జిల్లాలో రెండ్రోజుల క్రితం కలకలం రేపిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతనితో పాటు మరో ఆరుగురు హత్యలకు పాల్పడినట్లు నిర్థారించారు. ఈ నెల 23వ తేదీన నరసరావుపేటలో తండ్రి, కొడుకులైన ఇద్దరు రియల్టర్లు కిడ్నాప్ కు గురై.. ఆ తర్వాత ఓ వెంచర్లో హత్య చేయబడ్డారు. తొలుత హత్యలు రియల్టర్ల పనే అనుకున్నారు పోలీసులు. కేసు దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. వైసీపీ నేత బాదం మాధవరెడ్డి ప్రధాన నిందితుడని తేలింది. గతంలో ఈయన దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జిగా పనిచేశారు.

బెంగళూరుకు చెందిన కె.వీరాస్వామిరెడ్డి (62), అతని కొడుకు కె.వి.ప్రసాద్ రెడ్డి (37) ఈనెల 22న కోర్టు పనిపై పల్నాడు జిల్లా నరసరావుపేటకు వచ్చారు. 23న ఉదయం నరసరావుపేట కోర్టుకు వెళ్తున్న సమయంలో రెండు వాహనాల్లో వచ్చిన ఆరుగురు వ్యక్తులు తండ్రి, కొడుకుని కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి పాతమాగులూరులోని రియల్ ఎస్టేట్ వెంచర్లోకి తీసుకెళ్లి ఇద్దరినీ చంపి పరారయ్యారు.

Next Story