Kadapa: జగన్ సీమ బిడ్డ కాదు... సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ

by Disha Web Desk 16 |
Kadapa: జగన్ సీమ బిడ్డ కాదు... సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ
X

దిశ, కడప ప్రతినిధి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఇచ్చింది ఏమీ లేదని, జగన్ సీమ బిడ్డ కాదని సీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని తెలుగుదేశంపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తీవ్రంగా విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా సోమవారం 124వ రోజు బద్వేలు పట్టణంలో భారీ బహిరంగసభ నిర్వహించారు. బద్వేలు బస్టాండు కూడలి నుండి సిద్దవటం రోడ్డు, పోరుమామిళ్ల రోడ్డు, నెల్లూరు రోడ్లను జనప్రవాహం ముంచెత్తింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైసిపి నాయకులు తనను సీమలో అడుగుపెట్టనివ్వమని సవాల్ చేశారన్నారు. అయితే తనలో ఉన్నదీ సీమ రక్తమే సిల్లీ ఫెలోస్ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. సవాల్ చేయాలంటే హిస్టరీ ఉండాలని, అడ్డుకోవాలంటే దమ్ముండాలన్నారు. ఆ రెండూ వైసిపి నాయకులకు లేవన్నారు. క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం తమదని చెప్పారు. కోడికత్తి బ్యాచ్‌కి భయపడతామా అని విమర్శించారు. అడ్డొచ్చిన వైసీపీ సైకోలను సీమ సందుల్లో తొక్కుకుంటూ పోయామని చెప్పారు. 124 రోజులు, 44 నియోజకవర్గాలు, 1587 కిలోమీటర్లు. సీమ గడ్డపై యువగళం ఒక హిస్టరీ అని అన్నారు. సీమ పౌరుషం ఏంటో తాడేపల్లి ప్యాలస్‌కి చూపించామన్నారు. సీమలో తనను ఆశీర్వదించిన ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, జగన్‌కి సీమ చాలా ఇచ్చిందని, కానీ సీమకి జగన్ ఏం ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు. ‘‘సీమ జగన్‌ని సీఎం చేసింది. సంపద ఇచ్చింది. 49 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది. 8 మంది ఎంపీలను ఇచ్చింది. ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు. ఒక్క ఇటుక పెట్టలేదు. బద్వేల్ గడ్డపై నిలబడి సవాల్ చేస్తున్నా. సీమకు నివ్వు చేసింది ఏంటో చెప్పు. నేను చర్చకు సిద్ధం. ఎప్పుడు వస్తావో చెప్పు జగన్’. అంటూ లోకేష్ సవాల్ విసిరారు.

‘‘సీమకు ఏం చేస్తామో మిషన్ రాయలసీమలో చెప్పాం. మిషన్ రాయలసీమ అమలు చేసి సీమని నిలబెడతాం. ఒకవేళ ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే ఇదే బద్వేల్ సెంటర్‌లో చొక్కా పట్టుకొని నిలదీయాలి. టిడిపి అంటే తెలుగు వారి ఆత్మగౌరవం. వైసిపి అంటే గజ దొంగల పార్టీ. చంద్రబాబు అంటే బ్రాండ్... జగన్ అంటే జైల్. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు అంటూ బాదుడే బాదుతున్నారు. ఫ్యాన్ పర్మినెంట్‌గా స్విచ్ ఆఫ్ చేయండి. మీపై పడిన భారం తగ్గుతుంది. పులకేశి జగన్ ధన దాహానికి సామాన్యులు బలై పోతున్నారు. బద్వేల్‌లో ఇసుక దొరకదు. అదే ఇసుక బెంగుళూరు వెళ్తుంది. ఇసుక వ్యాపారంలో జగన్ బంధువు వీరారెడ్డి మోసం చేసాడని పోరుమామిళ్లకు చెందిన నారాయణ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రతి రోజు ఇసుక అక్రమ రవాణాలో జగన్ వాటా ఎంతో తెలుసా? రూ.3 కోట్లు. ఆ డబ్బు లెక్క పెట్టుకుంటే కానీ జగన్ నిద్రపోరు.’’ అని లోకేశ్ ఆరోపించారు.

Next Story