Ys Viveka Case: ఆ ఆరుగురిని విచారించండి..

by Disha Web Desk 16 |
Ys Viveka Case: ఆ ఆరుగురిని విచారించండి..
X

దిశ,కడప: వై.ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరుగురిని విచారించాలని ఏ5 నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య దేవిరెడ్డి తులశమ్మ పులివెందుల కోర్టులో వేసిన ప్రైవేట్ కేసు పిటిషన్‌ను శనివారం విచారించారు. ఈ కేసులో తులశమ్మతో పాటు వివేకా పి.ఏ కృష్ణారెడ్డి న్యాయవాదుల సమక్షంలో పులివెందుల మేజిస్ర్టేట్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో ప్రధానంగా ఆరుగురు వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రైవేట్ కేసు వేశారు. సీబీఐ అధికారులు తప్పుదోవ పట్టించే విధంగా విచారణ చేస్తున్నారని పేర్కొన్నారు.

ఒకే కోణంలో విచారణ జరుగుతోందని, మరో కోణంలో కూడా విచారించాలని పిటిషన్‌లో కోరారు. ప్రధానంగా వివేకానందరెడ్డి అల్లుడు ఎన్ రాజశేఖర్ రెడ్డి, బావమరిది ఎన్ శివప్రకాష్ రెడ్డి, టీడీపీ నేత బీటెక్ రవి, సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన పరమేశ్వరరెడ్డి, అనంతపురం జిల్లా యల్లనూరుకు చెందిన రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్‌లను విచారించాలని ప్రైవేట్ కేసు వేశారు. ఈ కేసులో అసలు నిజాలు తెలియాలంటే ఈ ఆరుగురిని సీబీఐ పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఆమె పిటిషన్‌లో కోరారు.

శనివారం పులివెందుల కోర్టులో తులశమ్మ స్టేట్ మెంట్‌ను రికార్డు చేశారు. ఇందుకు సాక్ష్యంగా కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేశారు. వివేకానందారెడ్డి హత్యకు గురైన విషయాన్ని కృష్ణారెడ్డే ముందుగా చూశారని, ఆయన ద్వారానే అందరికి తెలిసిందని పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసుపై కోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది.


Next Story

Most Viewed