Kadapa: దశాబ్దాల కలను నిజం చేస్తున్నాం: సీఎం జగన్

by Disha Web Desk 16 |
Kadapa: దశాబ్దాల కలను నిజం చేస్తున్నాం: సీఎం జగన్
X

దిశ,డైనమిక్ బ్యూరో: ‘మనం గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియాగా పిల్చుకునే మన గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఇవాళ ఒబరాయ్‌ లాంటి గ్రూపు ఇక్కడకి వచ్చి, సూపర్‌ లగ్జరీ సెవన్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం చేపడుతుంది. ఇలాంటి పెద్ద పెద్ద గ్రూపులు వచ్చి ఇలాంటి హోటల్స్‌ కడితే.. గండికోటని గ్లోబల్‌ టూరిజం మ్యాప్‌లోకి తీసుకొనిపోగలుగుతాం. ఇటు గండికోటతో పాటు అటు తిరుపతి, విశాఖపట్నంలో కూడా ఇలాంటి హోటల్స్‌ వస్తున్నాయి’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండోరోజు పర్యటనలో భాగంగా ఆదివారం గండికోటలో పర్యటించారు. ఈ సందర్భంగా గండికోటలోని ఒబెరాయ్ హోగల్ నిర్మాణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం విశాఖ, తిరుపతి ఒబెరాయ్ హోటల్స్‌కు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల కడప జిల్లా, గండికోట రెండూ అంతర్జాతీయ మ్యాప్‌లలో చోటు దక్కించుకుంటున్నాయన్నారు. కడప జిల్లాలో గతంలో ఇదే జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్‌ ఫ్యాక్టరీ రావాలని కలులు కన్నారని గుర్తు చేశారు. మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు రావాలని దశాబ్దాలుగా కన్న కలను నిజం చేస్తూ... గతేడాది జిందాల్‌ గ్రూపుతో కలిసి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌కు ఈ జూలైలో ఎన్విరానిమెంటల్‌ క్లియరెన్స్‌ వస్తుందన్నారు. దాని తర్వాత ఇప్పుడు కడుతున్న వేగం కన్నా యుద్ధప్రాతిపదికన అక్కడ కూడా పనులు రెట్టించిన వేగంతో జరుగుతాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు.


కొప్పర్తిలో డిక్సన్ కంపెనీ

వైఎస్ఆర్ కడప జిల్లా ఒబెరాయ్‌ హోటల్‌ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఈ హోటల్‌ వల్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ దాదాపు 500 నుంచి 800 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. ఈ ఒబరాయ్‌ ప్రాజెక్టు అనేది మిగిలిన ప్రాజెక్టులు రావడానికి ఒక లంగరు వలె ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ గండికోటలో ఇలాంటి గ్రూపు ప్రాజెక్టులు రావడానికి ఇంకా అవకాశం ఉందన్నారు. కనీసం ఒబెరాయ్‌ లాంటి ఇంకో గ్రూపుని తీసుకొచ్చే కార్యక్రమం కూడా ముమ్మరంగా చేస్తామని చెప్పారు. గండికోటలో గోల్ఫ్‌ కోర్ట్‌ పెట్టే ఆలోచన చేస్తే హోటల్‌కు మంచిది అని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయని, ఈ హోటల్‌ను ఒక గోల్ఫ్‌ రిసార్ట్‌గా దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలు ఉంటాయని చెప్పానని. ఆ దిశగా అడుగులు వేసేలా ఆలోచన చేస్తామని తెలిపారు. సోమవారం కొప్పర్తిలో డిక్స్‌న్‌ కంపెనీకు సంబంధించి ప్రారంభోత్సవం చేస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు.

కొప్పర్తిలో డిక్సన్‌ గ్రూపు 1000పైగా ఉద్యోగాలు ఇచ్చారన్నారు. మరో రెండు నెలల్లో ఇంకో 1000 ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. ఛానల్‌ ప్లే అనే మరో కంపెనీ... హోం ఆడియో సిస్టమ్స్‌ తయారు చేస్తుందని, రేపు కొప్పర్తిలో ఆ కంపెనీతో ఎంఓయూపై సంతకాలు చేయనున్నామని చెప్పారు. ఈ కంపెనీ ద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు. ఇక రెండోది ఎల్‌ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్‌ తయారు చేసే టెక్నో డామ్‌ ఇండియా అనే మరో కంపెనీతో కూడా రేపు ఎంఓయూ చేయబోతున్నామని, ఈ కంపెనీ ద్వారా మరో 200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని సీఎం జగన్ వెల్లడించారు.


Next Story