పేదింటి విద్యార్థిని కలను సాకారం చేసిన వైఎస్ జగన్

by Disha Web Desk 21 |
పేదింటి విద్యార్థిని కలను సాకారం చేసిన వైఎస్ జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : గ్రామీణ ప్రాంత పేద విద్యార్ధి కలను ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నారు. ఇప్పటికే ఆ పేద విద్యార్థిని చదువుకు ఆర్థిక సాయం అందజేసిన సీఎం వైఎస్ జగన్ మరోసారి ఉదారత చాటుకున్నారు. అమెరికా ఫ్లోరిడాలో కమర్షియల్ పైలెట్ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం చేయాలన్న విద్యార్థిని విజ్ఞప్తికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు కోనసీమ జిల్లాకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి కలిశారు. తన ఉన్నత చదువుకు గత ఏడాది జులైలో రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన సాయానికి జాహ్నవి దంగేటి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి...గతంలో జాహ్నవి ఏవియేషన్‌ శిక్షణకు రూ.50 లక్షలు ప్రభుత్వం సాయం అందించింది. అయితే తాజాగా అమెరికా ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్ధిక సాయం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. భారత సంతతికి చెందిన కల్పనాచావ్లా, సునీతా విలియమ్స్‌లా అంతరిక్షంలోకి అడుగుపెట్టాలన్న సంకల్ప స్ఫూర్తితో ముందుకెళుతున్నట్లు జాహ్నవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. గతంలో మీరు చేసిన ఆర్ధిక సాయంతో గ్రామీణ ప్రాంతానికి చెందిన జాహ్నవి ఐఐఏఎస్‌ ఫ్లోరిడా, యూఎస్‌ఏ నుండి సైంటిస్ట్‌ వ్యోమగామి అభ్యర్ధిగా సిల్వర్‌ వింగ్స్‌ అందుకున్నారని సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు.



Next Story