పల్నాడులో రక్తపుటేర్లు పారిస్తున్న వైఎస్ జగన్ : Kollu Ravindra

by Disha Web Desk 21 |
kollu ravindra
X

దిశ, డైనమిక్ బ్యూరో : జగన్ రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి పల్నాడులో రక్తపుటేర్లు పారిస్తూనే ఉన్నారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆరోపించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు అని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గం వెల్ధుర్తి మండలం గొట్టిపాళ్లలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు గొడ్డళ్లతో దాడి చేయడాన్ని ఖండించారు. గొడ్డళ్లతో టీడీపీ నేత రాజబోయిన బాబు కాళ్లు నరికివేయడం రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనం అని మండిపడ్డారు. ఈ దాడిలో పలువురు టీడీపీ నేతలకు గాయలయ్యాయని చెప్పుకొచ్చారు. టీడీపీ నేతల ఇళ్లపై పడి రాళ్లు, కర్రలతో దాడి చేయడమే కాకుండా మహిళలను భయబ్రాంతులకు గురిచేయడం అమానుషమన్నారు. వైసీపీ రాక్షస చర్యలతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసే పరిస్థితి నెలకొందన్నారు. బీసీలపై జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే మాచర్లలో వైసీపీ నేతలు విధ్వంసం సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనేందుకు వెల్ధుర్తి ఘటనే నిదర్శనమన్నారు. దాడి జరుగుతున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం అప్రజాస్వామిక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. తక్షణమే టీడీపీ నేతలపై మారణాయుధాలతో దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. బాధితులకు టీడీపీ అండగా ఉంటుంది అని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు.

Next Story