మతిస్థిమితంలేని ఇద్దరు బాలికలపై యువకుడి అత్యాచారం

by Naga Rani Yarlagadda |

మతిస్థిమితంలేని ఇద్దరు బాలికలపై యువకుడి అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితం లేని ఇద్దరు మైనర్ బాలికలపై ఒక యువకుడు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మభ్యపెట్టి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..

విజయవాడకు చెందిన ఇద్దరు బాధితులు మానసిక స్థితి సరిగ్గా లేని బాలికలు. దీనిని ఆసరాగా చేసుకున్న నిందితుడు త్రినాథ్.. వారికి తినుబండారాలు, రకరకాల వస్తువులు ఇస్తానని ఆశ చూపించాడు. వారిని నమ్మించి కృష్ణా నది సమీపంలోని ఒక నిర్మానుష్యంగా ఉన్న పాడుబడిన భవనానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికలపై నిందితుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇంటికివెళ్లాక ఒక బాలిక త్రినాథ్ ప్రవర్తన గురించి చెప్పడంతో.. వారు మరో బాలికను కూడా త్రినాథ్ ప్రవర్తనపై విచారించారు. దీంతో ఇద్దరిపైనా అత్యాచారం జరిగినట్లు తేలింది.

పోలీసుల రంగప్రవేశం - పోక్సో కేసు నమోదు

విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని పటమట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించి, నిందితుడిని గాలించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు త్రినాథ్ పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నామని, బాధితు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

Next Story