ట్విట్టర్‌లో రెట్టలు వేస్తూ చంకలు గుద్దుకునే నీవు..ఐసీఏఐ నోటీసులపై స్పందిచవేం?: విజయసాయిరెడ్డిపై బొండా ఉమా

by Disha Web Desk 21 |
ట్విట్టర్‌లో రెట్టలు వేస్తూ చంకలు గుద్దుకునే నీవు..ఐసీఏఐ నోటీసులపై స్పందిచవేం?: విజయసాయిరెడ్డిపై బొండా ఉమా
X

దిశ , డైనమిక్ బ్యూరో : శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్లుంది వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి పరిస్థితి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా అన్నారు. ట్విట్టర్‌లో నీతులు చెప్పే కసాయి గుట్టు ఐసీఏఐ విప్పేసిందని అన్నారు. క్రమశిక్షణా చర్యలపైనా స్టే తెచ్చుకున్న దిక్కుమాలిన బతుకెందుకు సాయి రెడ్డీ? అని ఓ ప్రకటనలో నిలదీశారు. ‘మిస్టర్ విజయసాయిరెడ్డీ, అలియాస్ ఏ2 ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నీపై క్రమశిక్షణా చర్యలకు సిద్ధపడితే ఎందుకు తేలుకుట్టిన దొంగలా దాక్కుంటున్నావు’ అని బొండా ఉమా ప్రశ్నించారు. ‘ప్రతి రోజూ, ప్రతి పూటా ట్విట్టర్‌లో రెట్టలు వేస్తూ చంకలు గుద్దుకునే నీవు అక్టోబర్ 23న జారీ చేసిన నోటీసులపై ఎందుకు నోరు మెదపకుండా ఉన్నావు? గతంలో అరబిందో, హెటిరో, రాంకీ, దాల్మియా సిమెంట్స్‌తో క్విడ్ ప్రో కో ద్వారా జగతిలోకి వేల కోట్ల ముడుపులు మళ్లించి జైల్లో కూర్చున్నావు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా నీవు చేసిన ఉల్లంఘనల నుండి ఎంతగా దారి మళ్లించే ప్రయత్నం చేసినా.. ఐసీఏఐ డిసిప్లినరీ డైరెక్టరేట్ నీ బండారం మొత్తం బట్టబయలు చేసింది. వీటితో పాటు జగతి పబ్లికేషన్స్ విలువ మదింపుపై డెల్లాయిట్ ఇచ్చిన నివేదికలోనూ నీ చేతివాటం బయటపెట్టింది’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు ‘ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వ్యాపారాలు చేసుకోవాలంటే జగతిలో రూ.5 కోట్లు పెట్టుబడి పెట్టాలని జయలక్ష్మి టెక్స్‌టైల్స్ అధినేత కన్నన్‌పై, ఎన్నారై మాదవ్ రామచంద్రపై తెచ్చిన ఒత్తిడులపైనా నీ ప్రమేయం గురించి ప్రస్తావించింది. చార్టర్డ్ అకౌంటెంట్‌గా ఉంటూ ఆ వృత్తికి అన్యాయం చేశావు. పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ ఆ హోదాను దుర్వినియోగం చేస్తున్నావు. అయినా ఇంకా నీతులు వల్లించడం, సుద్ధులు చెప్పడం ఏదైతే ఉందో అని న:భూతో న: భవష్యతి. ప్రతి విషయంపైనా ట్విట్టర్లో రెట్టలు వేసే నీవు.. ఈ వ్యవహారంపై కూడా స్పందిస్తావని, కోర్టుల్లో స్టేలు కాకుండా విచారణకు హాజరై దోషిగా తేలి నీ నిజాయితీ బయటపెట్టుకుంటావని ఆశిస్తున్నా’ అంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ఓ ప్రకటనలో ఆకాంక్షించారు.

Next Story