AP Politics:ఆ నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఫీవర్..!

by Disha Web Desk 18 |
AP Politics:ఆ నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఫీవర్..!
X

దిశ ప్రతినిధి,చిత్తూరు: పూతలపట్టు నియోజకవర్గం వైసీపీ క్యాడర్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుని ఫీవర్ పట్టిపీడిస్తోంది. నిన్న మొన్నటి వరకు నియోజకవర్గంలో గెలుపు విషయంలో తమకు ఎదురేలేదు అని విర్రవీగుతూ వచ్చిన వైసీపీకి నేడు గుబులు చుట్టుకుంది. నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అభ్యర్థి తమకు ఏమాత్రం గట్టి పోటీ నిచ్చే అభ్యర్థి కాదనే ధీమాతో ఉన్న వైసీపీ శ్రేణులకు నేడు సిట్టింగ్ ఎమ్మెల్యే తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు పనితీరుపై నిర్వహించిన పార్టీ అంతర్గత సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయనే కారణంతో ఈ ఎన్నికల్లో అభ్యర్థిగా పార్టీ అధిష్టానం సునీల్ కుమార్‌ను నియమించింది.

అయితే దీన్ని జీర్ణించుకోలేని సిట్టింగ్ ఎమ్మెల్యే అప్పట్లోనే పార్టీ పైనే కాకుండా కొంతమంది పార్టీ పెద్దల పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకు జరిగిన అసెంబ్లీ చివరి సమావేశాల్లో ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడిన తర్వాత మనసు మార్చుకున్నట్లు కనిపించిన బాబు పూతలపట్టు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభకు తనను ఆహ్వానించలేదనే కారణంతో తీవ్ర అవమానానికి గురై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో పూతలపట్టు ఎమ్మెల్యే టికెట్ కూడా తెచ్చుకోగలిగారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

పూతలపట్టు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సునీల్ కుమార్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తరపున పోటీ చేయడం అనేది ఇబ్బందికర వాతావరణాన్ని కల్పిస్తోంది. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెస్ బాబు అధికార పార్టీని కాదని కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తుడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో గుబులు ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న బాబుకు పడే ప్రతి ఓటు వైసీపీకి చెందిన ఓటు గానే ఆ పార్టీ శ్రేణులు భావిస్తూ ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ ఊహించని పరిణామాలతో ఎక్కువ ఓట్లను కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే చీల్చితే తమ అభ్యర్థి పరిస్థితి ఏంటనే ఆందోళన వైసీపీ క్యాడర్ను పట్టిపీడిస్తోంది.



Next Story

Most Viewed