Gannavaram : గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా యార్లగడ్డ వెంకట్రావు

by Disha Web Desk 21 |
Gannavaram : గన్నవరం టీడీపీ ఇన్‌చార్జిగా యార్లగడ్డ వెంకట్రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జిగా ఆ పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గన్నవరం ఇన్‌చార్జి బాధ్యతలను యార్లగడ్డకు అప్పగించినట్లు తెలిపారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సభలో నారా లోకేశ్ ఇదే విషయాన్ని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఆదేశాలతో యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో పసుపు జెండా ఎగురవేద్దామన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రతీ కార్యకర్త యార్లగడ్డ వెంకట్రావుకు సహకరించాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఇకపోతే ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన యార్లగడ్డ వెంకట్రావు హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిశారు. అనంతరం నారా లోకేశ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు. గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయమన్నా చేస్తానని..గుడివాడ నుంచి పోటీ చేయమన్నా తాను సిద్ధమని ప్రకటించారు. అంతేకాదు గన్నవరంలో లోకేశ్ సభను విజయవంతంగా నిర్వహించడంలో కూడా యార్లగడ్డ వెంకట్రావు సక్సెస్ అయ్యారు. లోకేశ్ సభలో యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గన్నవరం ఇన్‌చార్జి బాధ్యతలను యార్లగడ్డ వెంకట్రావు చేజిక్కించుకున్నారు.

Next Story

Most Viewed