ఉండవల్లీ..నువ్వు ఊసరవెల్లిలా ఎందుకు మారావ్?:టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు

by Disha Web Desk 21 |
ఉండవల్లీ..నువ్వు ఊసరవెల్లిలా ఎందుకు మారావ్?:టీడీపీ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఫైర్ అయ్యారు. ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాల్లో తనకంటే సీనియర్ అని అలాంటి వ్యక్తి నేడు ఊసరవెల్లి అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. ఈ విషయంలో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరంలో నారా లోకేశ్ క్యాంపు సైట్ వద్ద అయ్యన్నపాత్రుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు స్కిల్ కేసును సీబీఐతో విచారించాలని హైకోర్టులో ఉండవల్లి కేసు వేయడంపై మండిపడ్డారు. అసలు ఆ కేసులో ఏమైనా పస ఉందా? ఆ కేసుకు సంబంధించిన ఒక్క ఆధారమైనా ఉందా? డబ్బులు ఏదైనా చంద్రబాబు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వెళ్లినట్లు ఆధారం ఉందా? అని అయ్యన్నపాత్రుడు నిలదీశారు. చంద్రబాబును బయట తిరగనివ్వకూడదనే దురుద్దేశంతో జగన్ కుట్రలు పన్నుతుంటే... దానికి ఉండవల్లి సహకరిస్తున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనలో బ్రాంది సీసాలు చూపి ప్రజలకు ఎన్నో కథలు చెప్పావ్...నేటి పాలనపై ఒక్కసారి అయినా మాట్లాడావా? జగన్ రెడ్డి వైఫల్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.

వైసీపీ అక్రమాలపై నోరెత్తవేం?

తిరుపతి దేవస్థానంలో విపరీతమైన దోపిడీ జరుగుతుంటే ఒక్కసారి కూడా నోరు విప్పలేదు అని ఉండవల్లి అరుణ్ కుమార్‌ను అయ్యన్నపాత్రుడు నిలదీశారు. దేవస్థానాలకు చెందిన 43వేల ఎకరాలు కనబడడం లేదు అని మంత్రి చెబితే ఒక్కసారి కూడా ఎందుకు నోరెత్తలేదు అని ధ్వజమెత్తారు. గోదావరిలో ఇసుకను దోచుకుంటున్న వారిపై ఎందుకు మాట్లాడలేదు? అని మండిపడ్డారు. ఆ ఇసుక దోపిడీలో నీకు ఏమైనా వాటా ఉందా? రాజానగరం ఆవభూముల్లో కుంభకోణం జరిగితే ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కత్తిపూడి జంక్షన్ వద్ద ఫారెస్ట్ భూముల్లో ఖనిజ సంపద దోచుకుంటుంటే ఒక్కసారి కూడా నోరెత్తలేదు. ల్యాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వి దాన్ని భారతి సిమెంట్ కంపెనీలకు టిప్పర్లతో పోలీసుల కనుసన్నల్లో తోలుతుంటే ఒక్కసారి కూడా నోరెత్తలేదు అని మండిపడ్డారు. లక్షల టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఏడిపిస్తుంటే ఎందుకు నోరెత్తలేదు? మేధావిగా చెప్పుకుని తిరిగే నువ్వు తప్పుడు మనుషులకు సహకరించడం ఏంటి? అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విరుచుకుపడ్డారు.

జగన్ అక్రమాలపై ప్రశ్నించలేరా?!

ఉండవల్లి రామోజీరావుపై ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నాడు కానీ.. అగ్రిగోల్డ్ బాధితులు కొన్ని వేల మంది ఉన్నారు. వారి సమస్యలపై ఉండవల్లి ఒక్కసారి కూడా ఎందుకు నోరెత్తలేదు? అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ఉండవల్లి ముఖ్యమంత్రి డైరెక్షన్‌లోనే మాట్లాడతాడా? ఉండవల్లి మేధావా? మేతావివా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేదు. ఒక్కసారి కూడా రాజధాని గురించి ముఖ్యమంత్రిని నిలదీయలేదు అని మండిపడ్డారు. గంజాయి సరఫరాలో ఏపీని జగన్ మొదటి స్థానంలో నిలబెడితే కనీసం ఒక్కసారి కూడా యువత భవిష్యత్తు గురించి ఉండవల్లి నోరెత్తలేదు అని విరుచుకుపడ్డారు. సీఎం జగన్ మందు సీసాల్లో విషపూరితమైన మందు పోసి అమ్ముతుంటే మీకు కనబడడం లేదా? అని నిలదీశారు. 25ఏళ్లకు ఏపీ మద్యంపై జగన్మోహన్ రెడ్డి అప్పులు తెస్తే ఇది కూడా మీకు కనబడలేదా? అని విరుచుకుపడ్డారు. ఉండవల్లి తన అనుభవాన్ని, మేధో శక్తిని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగించాలి. కుట్రదారులతో కుమ్మక్కై నిజాయితీని, వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న విధ్వంసకుడి చర్యల్లో ఉండవల్లి పాత్రదారుడు కావద్దని అయ్యన్నపాత్రడు విజ్ఞప్తిచేశారు.

Read More Latest updates of Andhra Pradesh News

Next Story

Most Viewed