టీటీడీ ఎఫ్‌సీఆర్ఏ వివాదం ఏమిటీ?

by Disha Web Desk 7 |
టీటీడీ ఎఫ్‌సీఆర్ఏ వివాదం ఏమిటీ?
X

దిశ, తిరుపతి : విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద పొందిన లైసెన్సు గడువు ముగిసినా రెన్యువల్‌ చేసుకోకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం రూ.3 కోట్ల జరిమానా విధించింది. లైసెన్సు రెన్యువల్‌ చేసుకోకపోవడంతో విదేశీ భక్తులు హుండీలో వేసిన దాదాపు రూ.30 కోట్ల విలువ చేసే విదేశీ కరెన్సీ టీటీడీ ఖాతాలో డిపాజిట్‌ కాకుండా ఎస్‌బీఐ దగ్గరే ఉండిపోయింది. ఆర్‌బీఐ ఆ నగదును టీటీడీ అకౌంట్‌లోకి బదిలీ చేయడానికి అంగీకరించలేదు. టీటీడీ ఈ అంశంపై వివరణ ఇచ్చినా, సకాలంలో ఎందుకు రెన్యువల్‌ చేయలేదనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.

జరిగిందేమిటీ?

తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న హుండీలో భక్తులు నగదు, ఖరీదైన కానుకలు సమర్పిస్తుంటారు. హుండీలో ఏవి వేసినా భక్తులు ఎవరికీ, ఎలాంటి లెక్కలూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. చాలా మంది విదేశీ కరెన్సీ కూడా సమర్పిస్తారు. వాటిని టీటీడీ ఆర్‌బీఐ ద్వారా భారత కరెన్సీలోకి మార్చుకుంటుంది. 2018 తర్వాత నుంచి విదేశీ కరెన్సీని అలా మార్చుకోవడానికి ఆర్‌బీఐ ఒప్పుకోలేదు. ఇప్పటివరకూ ఎస్‌బీఐ వద్ద విదేశీ కరెన్సీ నిల్వలు పేరుకుపోయాయి.

ఎఫ్‌సీఆర్ఏ అంటే?

విదేశీ భక్తులు శ్రీవారి హుండీలో సమర్పించే విరాళాలను పొందడానికి టీటీడీ కేంద్ర హోంశాఖ నుంచి ఎఫ్‌సీఆర్ఏ చట్టం కింద లైసెన్స్ పొందింది. 2018లో లైసెన్స్ గడువు ముగిసినా టీటీడీ దానిని రెన్యువల్ చేసుకోకపోవడాన్ని కేంద్ర హోంశాఖ ఎఫ్‌సీఆర్ఏ విభాగం 2019లో గుర్తించింది. 2020లో ఈ చట్టానికి సవరణలు కూడా చేశారు. దీని ప్రకారం విదేశీ విరాళాలపై వచ్చే వడ్డీని ఆయా సంస్థలు ఉపయోగించకూడదు. కానీ టీటీడీ ఆ మొత్తాన్ని వినియోగించడం, ఆదాయ వివరాలను కూడా సరైన ఫార్మాట్‌లో ఇవ్వకపోవడం లాంటి కారణాలు చెబుతూ తాజాగా మరో రూ.3.19 కోట్ల జరిమానా విధించింది. దీంతో కేంద్రం విధించిన మొత్తం జరిమానా రూ.4.33 కోట్లకు చేరింది.

టీటీడీ చెబుతుంది ఇదే..

కేంద్రం విధించిన జరిమానా గురించి టీటీడీ వివరణ ఇచ్చింది. టీటీడీకి ఉన్న ఎఫ్‌సీఆర్ఏ లైసెన్సును నిబంధనలు పాటించడం లేదనే కారణాలతో 2018లో రద్దు చేశారని టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించి రూ.3 కోట్ల జరిమానా కూడా చెల్లించామని చెప్పారు. విదేశీ కరెన్సీని గత ఐదేళ్లుగా తీసుకోవడం లేదని అన్నారు. అయితే భక్తులు హుండీలో వేస్తున్నారని అన్నారు. ధార్మిక సంస్థ కాబట్టి సడలింపులు ఇవ్వాలని కోరారు. అప్పుడు పత్రాల విషయంలో ఏమైందో తెలియదు, ఇప్పుడు సహకరిస్తామని తెలియజేసినట్లు చెబుతున్నారు. ఐదేళ్లలో హుండీ ద్వారా దాదాపు రూ.30 కోట్ల విదేశీ కరెన్సీ వచ్చిందని, ఆ నగదు మార్పిడి కోసం ప్రయత్నించినపుడు, ఆ మొత్తం ఎవరిచ్చారు, ఎలా తీసుకున్నారంటూ ఆర్‌బీఐ ప్రశ్నించిందని టీటీడీ తెలిపింది.


Next Story

Most Viewed