ఏం తేల్చబోతున్నారు? చంద్రబాబు ఢిల్లీ టూర్ తో పొలిటికల్ హీట్

by Disha Web Desk 13 |
ఏం తేల్చబోతున్నారు? చంద్రబాబు ఢిల్లీ టూర్ తో పొలిటికల్ హీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ రాజకీయాలు కీలక పరిణామం దిశగా పయణిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బుధవారం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు ఢిల్లీకి పయనమయ్యారు. రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు నేడు, రేపు బీజేపీ పెద్దలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయి ఏపీలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించనున్నట్లు సమాచారం. జగన్ సర్కార్ ను ఓడించేందుకు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని ఇదివరకే నిర్ణయించగా తాజాగా బీజేపీ సైతం వీరితో జతకలవాలనే నిర్ణయానికి రావడంతోనే చంద్రబాబుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందనే చర్చ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.చంద్రబాబు పర్యటన అనంతరం జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సైతం ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర అగ్రనేతలు ఢిల్లీ బాట పడుతుండటం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సీట్ల పంపకాలే ప్రధాన అడ్డంకి:

ఢిల్లీ టూర్ కు ముందు చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు తాజాగా రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించారు. ఇక బాబు టూర్ నేపథ్యంలో నిన్నే రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత సీఎం రమేశ్ ను పిలిపించుకుని అమిత్ షా మాట్లాడారు. పొత్తు అవసరాలు, పార్టీ నేతల అభిప్రాయాలను అమిత్ షా తెలుసుకున్నారు. ఇక చంద్రబాబు భేటీ సందర్భంగా కలిసి పోటీ చేస్తే జరగబోయే పరిణామాలు, సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంపకాల విషయంలో చర్చలు ప్రారంభం కాగా బీజేపీ జతకలిసే ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై సమాలోచనలు జరిపే ఛాన్స్ కనిపిస్తోంది. వైసీపీని ఓడించేందుకు ఈ మూడు పార్టీలు కలిసి పని చేయాలనే అభిప్రాయానికి వచ్చినా సీట్ల సర్దుబాటే మిగిలిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇయితే మిత్రుల మధ్య అందరికి మేలు జరిగేలా పొత్తులు ఉండాలని భావిస్తున్న బీజేపీ ఎన్ని సీట్లను కోరుతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఈ అంశం చంద్రబాబు-అమిత్ షా చర్చల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఎవరికెన్ని సీట్లు?:

పొత్తుల్లో భాగంగా ఎవరికెన్ని సీట్లు దక్కబోతున్నాయనేదే ఫైనల్ గా మారినట్లు తెలుస్తోంది. బీజేపీ-జనసేనలకు కలిసి 30 అసెంబ్లీ, 5-6 లోక్ సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే 10 అసెంబ్లీ స్థానాలు7 లోక్ సభ స్థానాలను బీజేపీ ఆశిస్తోందని తెలుస్తోంది. అసెంబ్లీ సీట్ల విషయం ఎలా ఉన్నా లోక్ సభ సీట్ల విషయంలో కమలం పార్టీ పట్టుతో ఉందని అరకు, విశాఖ, రాజమండ్రి, నరసపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలను బీజేపీ కోరుతోందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు భేటీ అనంతరం ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story

Most Viewed