పశ్చిమ గోదావరి | తల్లిని కాపాడిన తనయుడు

by Thanuru Gopichand |

విద్యుత్ ఘాతానికి (Electric Shock) గురైన తల్లిని ఓ తనయుడు చాకచక్యంగా కాపాడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.

పశ్చిమ గోదావరి | తల్లిని కాపాడిన తనయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : విద్యుత్ ఘాతానికి (Electric Shock) గురైన తల్లిని ఓ తనయుడు చాకచక్యంగా కాపాడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సమయస్ఫూర్తితో బాలుడు వ్యవహరించిన తీరుతో ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం మండలంలోని జొన్నలగరువు గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన దీక్షిత్ ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. అయితే మీటింగ్ కు దీక్షిత్ తల్లి ఎంతకు రాలేదు. ఆమె కోసం చాలా సేపు ఎదురు చూశాడు. ఎంతకీ రాకపోవడంతో దీక్షిత్ తల్లిని మీటింగ్ కు తీసుకొచ్చేందుకు ఇంటికి వెళ్లాడు. ఇంటి పరిసరాల్లోకి వెళ్లిన దీక్షిత్ తన తల్లి కోసం వెతకసాగాడు. ఈ క్రమంలో తల్లి విద్యుత్ ఘాతానికి గురై అవస్థ పడుతున్న విషయాన్ని గమనించాడు. విద్యుత్ ఘాతంతో కొట్టుమిట్టాడుతున్న తల్లిని చూసి భయపడకుండా కాపాడే ప్రయత్నాన్ని మొదలు పెట్టాడు. భయపడి కేకలు వేయకుండా ఎలా కాపాడాలా అని ఆలోచించాడు.

సహాయం కోసం అందరిని పిలిచేలోపల ఆలస్యమైతుందని భావించిన దీక్షిత్ తన బుర్రకు పని చెప్పాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిసరాలను గమనించాడు. విద్యుత్ ఘాతానికి కారణమైన మోటార్ స్విచ్ఛ్ ను రెండో ఆలోచన లేకుండా వెంటనే ఆపివేశాడు. ఆ తరువాత తల్లికి తగిలి ఉన్న వైర్లను తొలగించాడు. దీంతో దీక్షిత్ తల్లి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ హఠాత్పరిణామం గురించి తెలుసుకున్న స్థానికులు పరుగుపరుగున దీక్షిత్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తితో తన తల్లిని కాపాడినందుకు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అనంతరం స్తానికుల సహకారంతో తల్లిని స్థానిక ఆసుపత్రికి తరలించాడు. తల్లి క్షేమంగా ఉందని నిర్ధారించుకున్న తరువాత ఆమెను వెంటబెట్టుకుని మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు హాజరయ్యారు. కళ్లముందే విద్యుత్ ఘాతానికి గురైన తల్లిని చూసి కూడా భయపడకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని, చాకచక్యంగా వ్యవహరించిన దీక్షిత్‌ను స్థానిక ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయులు ఎంతగానో అభినందిస్తున్నారు. కేవలం ఐదో తరగతి చదువుతున్న ఈ విద్యార్థి చూపిన అద్భుతమైన ధైర్యం, సమయస్ఫూర్తి ఎందరికో ఆదర్శప్రాయమని, అతని వల్లే తల్లి ప్రాణాలు దక్కాయని గ్రామస్థులు ఘంటాపథంగా చెబుతున్నారు.

Next Story