Tadepalligudem: వైసీపీ ఎంపీ నినాదంతో దద్దరిల్లిన టీడీపీ, జనసేన సభ

by Vemula.Srinu Prasad |   (  Updated:2024-02-28 13:27:23  IST  )

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ జరుగుతోంది..

Tadepalligudem: వైసీపీ ఎంపీ నినాదంతో దద్దరిల్లిన టీడీపీ, జనసేన సభ
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సహా టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ సభకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా వచ్చారు. జై టీడీపీ, జై జనసేన, జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కృష్ణార్జునుల్లా ఉన్నారని.. టీడీపీ, జనసేన కలవడంతో సీఎం జగన్ వెన్నులో వణుకుపుడుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు అభినవ కౌరవలు అని ఆయన అభివర్ణించారు. త్వరలో జరగబోయే కురుక్షేత్రంలో కౌరవులందరినీ టీడీపీ, జనసేన సైనికులు తుదిముట్టించనున్నారని వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని, రాష్ట్ర ప్రజలు అంతం చేసి ప్రజా స్వామ్యాన్ని కాపాడాలని రఘురామకృష్ణం రాజు పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చరిత్రపుటల్లో కలిసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మూడు రాజధానులంటూ డ్రామాలాడారని విమర్శించారు. ఇప్పుడే వాటి ప్రసక్తే లేకుండా చేశారని ఎద్దేవా చేశారు. రాజధాని లేని రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధాని చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నరసాపురం ఎంపీ పోటీ చేస్తానని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు.

Read More..

విజయవాడ వెస్ట్ పై వీడని సంక్షోభం.. టికెట్ వారికేనా..?

Next Story