Innovative Programme: పేపర్ బాయ్ అవతారమెత్తిన పాలకొల్లు ఎమ్మెల్యే

by Disha Web Desk 16 |
Innovative Programme: పేపర్ బాయ్ అవతారమెత్తిన పాలకొల్లు ఎమ్మెల్యే
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రూటే సెపరేటు. గుంతల రోడ్డులో చేపలు పట్టాలన్నా, పశుగ్రాసం పంచాలన్నా, సైకిల్‌పై రౌండ్లు కొట్టాలన్నా ఆయనకు ఆయనే సాటి. ఏదో ఒక వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో దూసుకుపోతుంటారు. తాజాగా ఆయన మరో అవతారం ఎత్తారు. పేపర్ బాయ్‌గా మారిపోయారు. ఎన్టీఆర్ టిడ్కో గృహాల పనులు వెంటనే పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్‌గా మారారు. బుధవారం ఉదయం 5 గంటలకు నిద్రలేచి సైకిల్‌పై 17వ వార్డులోని ఇళ్ళకు వెళ్లి పేపర్ వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

టీడీపీ హయాంలో 90 శాతం పూర్తి

ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ టీడీపీ హయాంలో 7158 టిడ్కో ఇళ్ళు పాలకొల్లులో మంజూరు చేసి 90% నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన 10% 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయి ఖర్చు పెట్టకుండా కేవలం ఇళ్లకు రంగులు వేశారని మండిపడ్డారు. నాడు ఉచితమని చెప్పి నేడు రుణాల పేరుతో బ్యాంకులకు తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. పెదగరువులో కట్టాలసిన ఇళ్లను రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పట్టణ లబ్ధిదారులకు 15-20 కిలోమీటర్ల దూరంలో కాజ గొప్పులో పీకల్లోతు నీళ్ళల్లో ఉన్న ముంపు స్థలాన్ని పట్టాభూములుగా ఇవ్వడం దగాతనమేనంటూ ధ్వజమెత్తారు. తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న జగన్‌ను నిద్ర లేపేందుకే తాను సైకిల్‌పై పేపర్లు వేసినట్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.


Next Story

Most Viewed