3,403 కిలోల గంజాయి ధ్వంసం

by Vemula.Srinu Prasad |

పర్యావరణానికి హాని కలగకుండా ధ్వంసం చేసే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్ నిర్వహిస్తోంది...

3,403 కిలోల గంజాయి ధ్వంసం
X

దిశ ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని పర్యావరణానికి హాని కలగకుండా ధ్వంసం చేసే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్ నిర్వహిస్తోంది. ఏలూరు జిల్లాలో నమోదైన 58 కేసుల్లో పట్టుకున్న 3403.753 కిలోల గంజాయిని పర్యావరణ అనుకూల పద్ధతిలో జిందాల్‌ అర్బన్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ సెంటర్‌లో శనివారం ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్‌ శివ కిశోర్‌ వెల్లడించారు. ఏలూరు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుకున్న గంజాయిను గుంటూరులోని జిందాల్‌ సెంటర్‌కు తరలించామన్నారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఏలూరు రేంజ్ ఐజీ, జి.వి.జి. అశోక్ కుమార్, పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ ఈగల్ ఐజీ రవి కృష్ణ, ఏలూరు జిల్లా ఎస్పీ, కె. ప్రతాప్ శివ కిషోర్, ప్రత్యేకంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

పర్యావరణ అనుకూల దహన ప్రక్రియ

సాధారణంగా గంజాయిని దహనం చేయడం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. అయితే, ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని గంజాయిని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్‌‌లోని ప్రత్యేకమైన, అధునాతన యంత్రాలలో దహనం చేసే కార్యక్రమం చేపట్టామని ఎస్పీ చెప్పారు. ఈ పద్ధతి ద్వారా దహనం చేయడం వల్ల కాలుష్యం అతి తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపుతోందన్నారు. గంజాయిని ధ్వంసం చేయడం ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయదారులకు గట్టి హెచ్చరిక పంపినట్లు ఎస్పీ తెలిపారు.

Next Story