ఆరు నెలల్లో రాజధాని రైతుల సమస్యలు పరిష్కరిస్తాం : కేంద్రమంత్రి

by Thanuru Gopichand |

అమరావతి రాజధాని (Capital Amaravati) రైతుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

ఆరు నెలల్లో రాజధాని రైతుల సమస్యలు పరిష్కరిస్తాం : కేంద్రమంత్రి
X

దిశ, వెబ్ డెస్క్ : అమరావతి రాజధాని (Capital Amaravati) రైతుల సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర మంత్రి నారాయణ, తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్, అడిషనల్ కమిషనర్, రైతు జేఏసీ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన త్రిసభ్య కమిటీ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వ కారణంగా డెవలప్మెంట్ పనులు నిలిచిపోయాయి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందన్నారు. అయితే భూవివాదాల కారణంగా పనుల్లో జాప్యం ఏర్పడుతుందన్నారు. కొందరు తమవి కాని భూములను తమవిగా పేర్కొంటూ సమస్యలకు కారణమవుతున్నారన్నారు. వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. వివాదాస్పద భూముల్లో 20 ఎకరాలు కుటుంబపరమైనవి కాగా, మరో 45 ఎకరాలు సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయన్నారు. వాటిని సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ తో కలిసి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే రాజధాని పరిధిలో 90 శాతానికి పైగా కుటుంబాలకు ప్లాట్లను కేటాయించామని వెల్లడించారు.

5 సంస్థలకు 25 గ్రామాలు

రాజధాని పరిధిలోని 25 గ్రామాలను డెవలప్ చేసేందుకు ఐదు సంస్థలకు కాంట్రాక్టును ఇవ్వనున్నామన్నారు. ఆయా గ్రామాల్లో నీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి పైపులైన్లు, రోడ్లు, శానిటేషన్, వీధి దీపాల వంటి ఆధారంగా జరిపే డీపీఆర్ సమర్పించాలని ఆయా సంస్థలను ఆదేశించామన్నారు. డిసెంబర్ 15 నుంచి 30 లోపు ఫైనల్ డీపీఆర్ రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే ఏడాది జనవరి 1 నుంచి పనులు ప్రారంభమవుతాయన్నారు. జూన్ నాటికి ఆరు నెలల్లో నిర్దేశిత పనులు పూర్తవుతాయని చెప్పుకొచ్చారు. ఎన్సీసీ సంస్థకు 4, ఆర్వీఆర్ కు 3, మేఘాకు 13, బీఎస్ఆర్ కు 5, ఎల్ అండ్ టీకి 5 గ్రామాలను కేటాయించడం జరిగిందని వెల్లడించారు.

రైతుల నమ్మకాన్ని వమ్ము చేయం : మంత్రి నారాయణ

సీఎం చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అమరావతి రాజధాని నిర్మాణానికికి 58రోజుల్లో 34వేల ఎకరాలు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని వమ్ము చేయమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆరు నెలల్లో రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ప్రతిరోజూ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయన్నారు. ప్లాట్ల అలాట్మెంట్ కూడా జరుగుతోందని తెలియజేశారు. 719 ఎకరాలను ఇంకా కేటాయించాల్సి ఉందన్నారు. అందుకోసం ఉండవల్లి లేఅవుట్ రూపొందించామన్నారు. నవంబరు 27 లేవుట్ పై అభిప్రాయ సేకరణ పూర్తవుతుందన్నారు. అది అవ్వగానే ప్లాట్లు అలాట్ చేస్తారని వెల్లడించారు. తొలుత వాటిలో 320 ఎకరాల ప్లాట్ల అలాట్మెంట్ పూర్తవుతుందని ప్రకటించారు. ఒకరిద్దరు తమ స్వార్థం కోసం చెప్పే మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు.

Next Story