వైసీపీలోనే కొనసాగుతాం :నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి

by Disha Web Desk 21 |
వైసీపీలోనే కొనసాగుతాం :నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి అనుబంధంగా మారిన నేపథ్యంలో మేయర్ స్రవంతి తన భర్త జయవర్థన్‌లు కోటంరెడ్డికి మద్దతుగా నిలిచారు. అవసరమైతే వైసీపీకి, మేయర్ పదవికి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించారు. కానీ టీడీపీలో మాత్రం చేరలేదు. అయితే ఇటీవల జరిగిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మేయర్ పొట్లూరి స్రవంతి దంపతులు తిరిగి వైసీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి మేయర్ దంపతులు చేరుకున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌ల సమక్షంలో తాము వైసీపీలోనే తిరిగి కొనసాగుతామని ప్రకటించారు. దీంతో వారిని వైసీపీ జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్‌చార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డిలు స్వాగతించారు. ఈ సందర్భంగా మేయర్ దంపతులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిలను ఘనంగా సత్కరించారు.

Next Story