ఆ పని చేసినందుకు 19 మందిపై కేసులు నమోదు చేశాం.. ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా

by Disha Web Desk 1 |
ఆ పని చేసినందుకు 19 మందిపై కేసులు నమోదు చేశాం.. ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా
X

దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్ల తుది జాబితా తయారీకి 2023 డిసెంబర్‌ 9 వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాలో మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో సవరణలు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించామని తెలిపారు. ఓటరు నమోదుకు కొత్తగా వచ్చిన దరఖాస్తులను జనవరి 12లోపు క్లియర్ చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే మరణించిన ఓటర్లు, డూప్లికేట్లు, ఓటు బదిలీ దరఖాస్తులను బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి పరిష్కరించారని తెలిపారు.

అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు 5,64,819 పేర్లను అనర్హులుగా గుర్తించామని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేస్తున్నారంటూ తమకు కంప్లయింట్లు అందాయని తెలిపారు. కాకినాడ నగరంలో ఫాం-7 ద్వారా గంపగుత్తగా ఓటర్లను చేరుస్తున్న 13 మంది, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దురుద్దేశ పూర్వకంగా దాఖలు చేసిన ఆరుగురిపై కేసులు నమోదు చేశామని వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ, ఐటీ చట్టాల కింద కేసులు పెట్టామని. అదేవిధంగా నిబందనలు ఉల్లంఘించిన 24 మంది బీఎల్‌వోపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.



Next Story

Most Viewed