తగ్గేదేలే: బ్రో మూవీపై ఢిల్లీకి మంత్రి అంబటి..నిఘా సంస్థలకు ఫిర్యాదు?

by Disha Web Desk 21 |
తగ్గేదేలే: బ్రో మూవీపై ఢిల్లీకి మంత్రి అంబటి..నిఘా సంస్థలకు ఫిర్యాదు?
X

దిశ, డైనమిక్ బ్యూరో : పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. బ్రో మూవీలో శ్యాంబాబు పాత్ర రాజకీయంగా దుమారం రేపుతుంది. తనను ఉద్దేశించే పవన్ కల్యాణ్ బ్రో సినిమాలో ఆ పాత్ర పెట్టారని..సంక్రాంతికి తాను వేసిన డ్యాన్స్‌ను అలా చూపించి అవమానించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రస్తుతం బ్రో మూవీ దాని చుట్టూ అల్లుతున్న రాజకీయం ఏపీ పాలిటిక్స్‌లో ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. బ్రో సినిమా ద్వారా తనను అవమానిస్తే త్వరలో తాను కూడా ఎమ్‌ఆర్‌ఓ పేరుతో ఓ సినిమా తీస్తానని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎంఆర్ఓ అంటే మ్యారేజెస్, రిలేషన్స్,అఫెండర్ అని అర్థమని చెప్పుకొచ్చారు. అటు అంబటి రాంబాబు సినిమాకు పోటీగా తాము కూడా సినిమా తీస్తున్నట్లు జనసేన కార్యకర్తలు ప్రకటించారు. ఎస్ఎస్ఎస్ అంటే సందులో సంబరాల రాంబాబు పేరుతో సినిమా తీస్తామని హెచ్చరించారు. ఈ సవాళ్లు ప్రతిసవాళ్లతో బ్రో సినిమా కలెక్షన్స్ ఊపందుకున్నాయి. ఇది కాస్తా ఇప్పుడు మనీల్యాండరింగ్‌వైపునకు డైవర్ట్‌ అయ్యింది. బ్రో సినిమాకు సంబంధించి ఆర్థిక లావాదేవీలపై నిఘా సంస్థలకు ఫిర్యాదు చేస్తానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. అంతేకాదు ఆగమేఘాల మీద ఢిల్లీ వెళ్లారు. వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. బ్రో సినిమా ఆర్థిక లావాదేవీలపై నిఘా సంస్థలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

విజయసాయిరెడ్డితో అంబటి

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు బ్రో సినిమా విడుదలైనప్పటి నుంచి ఓ పట్టానలేరు. బ్రో సినిమాలో తనను అవమానించేలా క్యారెక్టర్ క్రియేట్ చేయడంతోపాటు తాను చేసిన డ్యాన్స్‌తో మరింతగా తన ప్రతిష్టను దిగజార్చారంటూ మదనపడుతున్నారు. అంతేకాదు బ్రో సినిమా అట్టర్ ప్లాప్ అని ప్రకటించేశారు. అక్కడితో ఆగిపోలేదు ఏకంగా బ్రో సినిమాకు సంబంధించి రివ్యూ కూడా ఇచ్చేశారు. కలెక్షన్స్‌ కూడా బట్టబయలు చేసి వార్తల్లో నిలుస్తున్నారు అంబటి రాంబాబు. తాజాగా ఈ వ్యవహారం ఢిల్లీకి చేరుకుంది. బ్రో సినిమాకు కలెక్షన్ నిల్ అని అంబటి ఆరోపిస్తూ భారీ లాభాలు ఆర్జించామని సినీ యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు బట్టబయలు చేస్తానని శపథం చేసిన మంత్రి అంబటి రాంబాబు హుటాహుటిన ఢిల్లీ వెళ్లిపోయారు. ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డితో భేటీ అయ్యారు. బ్రో సినిమా ఆర్థిక లావాదేవీలపై నిఘా సంస్థలకు ఫిర్యాదు చేసే అంశంపై విజయసాయిరెడ్డితో మంత్రి అంబటి రాంబాబు చర్చించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మెుత్తానికి ఈ బ్రో సినిమా వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed